Joe Root | భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ సారథి జో రూట్ ఎట్టకేలకు తన బ్యాట్కు పనిచెప్పాడు. ఈ సిరీస్లో భాగంగా గత మూడు టెస్టులలో అర్థ సెంచరీ సాధించేందుకు నానా తంటాలు పడుతున్న రూట్.. రాంచీ టెస్టులో మాత్రం తనలోని అసలైన టెస్టు ఆటగాడిని బయటకు తీశాడు. 57 పరుగులకే 3, 112 రన్స్కు 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను తన శతకంతో ఆదుకున్నాడు. రాంచీలో తొలి రోజు సెంచరీ చేయడం ద్వారా.. భారత్పై ప్రపంచ బ్యాటర్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టులలో రూట్కు ఇది 31వ సెంచరీ కాగా.. భారత్పై పదో శతకం. తద్వారా అతడు టీమిండియాపై అత్యధిక శతకాలు (టెస్టులలో) నమోదుచేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
రూట్ కంటే ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్.. భారత్ పై 37 టెస్టు ఇన్నింగ్స్లలో 9 సెంచరీలు చేశాడు. రూట్ 52 ఇన్నింగ్స్లలో పది శతకాలు బాదాడు. ఈ జాబితాలో గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్ – 8), వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్ -8), రికీ పాంటింగ్ (ఆసీస్ – 8)లు తదుపరి స్థానాల్లో ఉన్నారు.
Most Test centuries against India:
Joe Root: 10
Steve Smith: 9
Garry Sobers: 8
Viv Richards: 8
Ricky Ponting: 8#INDvENG pic.twitter.com/bfcyozw8Ns— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2024
కాగా టెస్టులు వన్డేలలో కలిపి రూట్కు భారత్పై ఇది 13వ శతకం. ఆస్ట్రేలియా మాజీ సారథులు రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్లు తలా 14 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. భారత్పై రూట్కు ఇది 20వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు.
అత్యంత ‘స్లో’గా..
గత కొన్నాళ్లుగా టెస్టులకే పరిమితమైన జో రూట్.. బెన్ స్టోక్స్ అండ్ కో. అలవరుచుకున్న బజ్బాల్ ఆటకు అలవాటుపడ్డాడు. కానీ ఇండియాలో రూట్ ప్లాన్ బెడిసికొట్టింది. బుమ్రా, అశ్విన్, జడేజాల దాటికి అతడు తొలి మూడు టెస్టులలో దారుణంగా విఫలమయ్యాడు. కానీ రాంచీ టెస్టులో బజ్బాల్ను పక్కనబెట్టి తన అసలైన టెస్టు ఆట ఆడాడు. తొలి రోజు అతడు.. 219 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. టెస్టులలో అతడికి ఇది మూడో నెమ్మదైన సెంచరీ. ఇంతకుముందు న్యూజిలాండ్పై 2019లో హమిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో 259 బంతుల్లో సెంచరీ చేశాడు. 2013లో ఆస్ట్రేలియాతో లార్డ్స్ టెస్టులో సెంచరీ చేసేందుకు అతడు 247 బాల్స్ తీసుకున్నాడు. 2021లో లార్డ్స్లో భారత్తోనే జరిగిన మ్యాచ్లో 200 బంతుల్లో శతకం పూర్తి చేశాడు.