IND vs ENG 3rd Test: భారత్-ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ వేదికగా రేపట్నుంచి (ఫిబ్రవరి 15-19) మూడో టెస్టు మొదలుకావాల్సి ఉంది. ఇదివరకే ఇరు జట్లు తలా ఓ మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో రాజ్కోట్లో గెలిచిన జట్టుకు కీలక ఆధిక్యం దక్కనుంది. రెండు జట్లకు కీలకమైన ఈ మ్యాచ్.. వ్యక్తిగతంగా పలువురు ఆటగాళ్లకూ మధుర జ్ఞాపకాలను పంచనుంది. టెస్టులలో ఐదు వందల వికెట్ల ఘనతను సాధించడానికి అశ్విన్.. 700 వికెట్లకు అండర్సన్లు అత్యంత చేరువగా వచ్చారు. ఈ ఇద్దరే గాక ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్కు ఇది వందో టెస్టు మ్యాచ్ కానుంది.
అశ్విన్ ఒక్క వికెట్ తీస్తే ఐదు వందల వికెట్లు తీసిన ఘనత సాధిస్తాడు. ఈ జాబితాలో భారత్ నుంచి అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాతి స్థానంలో అశ్విన్ నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 499 వికెట్లున్నాయి. ఇక ఇంగ్లండ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్.. మరో ఐదు వికెట్లు తీయగలిగితే అతడు టెస్టులలో 700 వికెట్ల క్లబ్లో చేరతాడు. అదీగాక అండర్సన్కు ఇది 185వ టెస్టు కానుంది. అండర్సన్.. ఇప్పటివరకు 184 టెస్టులలో 695 వికెట్లు తీశాడు. బజ్బాల్ ఆటతో టెస్టులను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్కు ఇది వందో టెస్టు. ఈ ముగ్గురూ రాజ్కోట్ టెస్టును మెమొరెబుల్గా మలుచుకోవాలని భావిస్తున్నారు.
ఆ ఇద్దరు ఎంట్రీ..!
శ్రేయస్ అయ్యర్కు ఉద్వాసన, కెఎల్ రాహుల్ ఇంకా గాయం నుంచి కోలుకోలేకపోవడం, విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో భారత జట్టు రాజ్కోట్ టెస్టులో ఇద్దరు కొత్త కుర్రాళ్లతో బరిలోకి దిగబోతోంది. వికెట్ కీపర్గా కెఎస్ భరత్ తొలి రెండు టెస్టులలో విఫలమైన నేపథ్యంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. అంతేగాక చాలాకాలంగా భారత జట్టులో అవకాశం కోసం చూస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు కూడా ఈ మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. ఏ క్రికెటర్కు అయినా అరంగేట్ర మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. మరి ఇన్ని ప్రత్యేకతలున్నా రాజ్కోట్ టెస్టు ఎంత రసవత్తరంగా సాగుతుందో చూడాలి.