IND vs ENG 3rd Test | భారత జట్టులో రాకరాక వచ్చిన అవకాశాన్ని ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఆడుతున్న తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్లలోనూ అర్థ సెంచరీలతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో 66 బంతుల్లోనే 62 పరుగులు చేసిన ఈ ముంబై కుర్రాడు.. రెండో ఇన్నింగ్స్లో 72 బంతులాడి 68 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్లలోనూ అర్థ సెంచరీలు చేయడంతో సర్ఫరాజ్ ఖాన్.. ఆడుతున్న తొలి టెస్టులోనే ఈ ఘనత అందుకున్న నాలుగో భారత బ్యాటర్గా నిలిచాడు.
భారత్ తరఫున గతంలో దిలావర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్, శ్రేయస్ అయ్యర్లు ఈ ఘనత అందుకున్నవారిగా ఉన్నారు. దిలావర్ హుస్సేన్.. 1934లో ఇంగ్లండ్తో ఆడిన మ్యాచ్లో 59, 57 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. 1971లో క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో 65, 67 రన్స్ సాధించాడు. 2021లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 105 రన్స్ చేయగా రెండో ఇన్నింగ్స్లో 65 పరుగులు చేశాడు. తాజాగా సర్ఫరాజ్ ఖాన్.. 62, 68 పరుగులతో వారి సరసన చేరాడు.
రాజ్కోట్ టెస్టులో భాగంగా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (214 నాటౌట్) డబుల్ సెంచరీతో కదం తొక్కగా శుభ్మన్ గిల్ (91), సర్ఫరాజ్ ఖాన్ (68 నాటౌట్)లు రాణించడంతో రెండో ఇన్నింగ్స్లో భారత్.. 4 వికెట్లు కోల్పోయి 430 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 126 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ఇంగ్లండ్ ముందు మొత్తంగా 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోజున్నర ఆట మిగిలిఉన్న ఈ మ్యాచ్లో విజయం ఎవరిని వరించేనో మరి..