ఢాకా: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లా జట్టు తొలుత వెంటవెంటనే వికెట్లను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న జట్టును మహ్మదుల్లా, మెహదీ హసన్ ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా ఆచిచూతి ఆడుతూనే చెత్తబంతి పడినప్పుడల్లా బౌండరీలు కొడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు.
ఏడో వికెట్కు 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో 47వ ఓవర్ మొదటి బంతికి మహ్ముదుల్లా ఔటయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ మహ్మదుల్లా వెనుదిరిగాడు. దాంతో జట్టు స్కోరు 47.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులుగా ఉంది.
అంతకుముందు రెండో ఓవర్ ఐదో బంతికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్ అనముల్ హక్ (11) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 10వ ఓవర్ రెండో బంతికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్లోనే కెప్టెన్ లిటన్ దాస్ (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత 52 పరుగుల వద్ద 14వ ఓవర్ మొదటి బంతికి ఊపు మీదే ఉన్నట్లు కనిపించిన నజ్ముల్ హుస్సేన్ షాంటో (21) ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత 17వ ఓవర్ ఆఖరి బంతికి షకీబ్ అల్ హసన్ (8) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో శిఖర్ ధవన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 19వ ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీం (12) కూడా సుందర్ బౌలింగ్లోనే శిఖర్ ధవన్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 18.5 ఓవర్లలో 5 వికెట్లకు 69 పరుగులు మాత్రమే.
ఆ తర్వాత బంతికే సుందర్ బౌలింగ్లోనే అఫీఫ్ హుస్సేన్ పరుగులేమీ చేయకుండానే బౌల్డ్ అయ్యాడు. అనంతరం మహ్మదుల్లాకు తోడుగా మెహదీ హసన్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 148 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. ఆఖరికి 47వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ వారి భాగస్వామ్యానికి తెరదించాడు.