ముంబై: క్రికెట్ ఉత్సాహాన్ని వీధుల నుంచి స్టేడియానికి తీసుకొచ్చేందుకు మరో లీగ్ మన ముందుకు రాబోతున్నది. సీసీఎల్ స్పోర్ట్స్ ఎల్ఎల్పీ భారత్లో తొలిసారిగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ఐఎస్పీఎల్) ప్రారంభించింది. అరంగేట్రం సీజన్ మార్చి 2, 2024 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్లో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, శ్రీనగర్ ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఈ లీగ్ ద్వారా ప్రతిభ కల్గిన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురానున్నారు. జాతీయ వేదికపై వారి ప్రదర్శన సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. లీగ్ ఆవిష్కరణ కార్యక్రమంలో భారత మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి, అశిష్ షెలార్, అమోల్ కాలే తదితరులు పాల్గొన్నారు.