చతోగ్రామ్ : ఐర్లాండ్తో సోమవారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసిన తరుణంలో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.
వర్షం నిలిచి ఆటను తిరిగి ఆరంభించిన తరువాత ఐర్లాండ్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 104 పరుగులుగా నిర్ధారించారు. అయితే ఐర్లాండ్ 8 ఓవర్లలో 5 వికెట్లకు 81 పరుగులే చేయడంతో బంగ్లాదేశ్ 22 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. బంగ్లా జట్టులో అత్యధిక స్కోరర్ రోని తాలూక్దార్(38 బంతుల్లో 67; 3 సిక్సర్లు, 7 ఫోర్లు) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. రెండో మ్యాచ్ బుధవారం ఇక్కడే జరుగనుంది.