వార్ వన్ సైడే! యువ ఆటగాళ్లనే నిలువరించలేకపోయిన వెస్టిండీస్.. హేమాహేమీలతో నిండిన టీమ్ఇండియాకు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ వేసిన పునాదిపై దినేశ్ కార్తీక్ అందమైన సౌధం నిర్మించడంతో తొలుత టీమ్ఇండియా భారీ స్కోరు చేయగా.. ఆనక మన బౌలర్ల పరాక్రమం ముందు విండీస్ ఎదురు నిలువలేకపోయింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసిన రోహిత్ సేన.. సోమవారం మరోసారి కరీబియన్లతో కలబడనుంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వన్డే సిరీస్లో దుమ్మురేపి వెస్టిండీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమ్ఇండియా.. టీ20ల్లోనూ బోణీ కొట్టింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి పోరులో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కదంతొక్కగా.. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (19 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ అవతారమెత్తిన సూర్యకుమార్ (24; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ (0), రిషబ్ పంత్ (14), హార్దిక్ పాండ్యా (1), రవీంద్ర జడేజా (16) ఆకట్టుకోలేకపోయారు. విండీస్ బౌలర్లలో జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసింది. బ్రూక్స్ (20) టాప్స్కోరర్ కాగా.. మయేర్స్ (15), హోల్డర్ (0), కెప్టెన్ పూరన్ (18), పావెల్ (14), హెట్మైర్ (14) విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అశ్విన్, అర్శ్దీప్ సింగ్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్:20 ఓవర్లలో 190/6 (రోహిత్ 64, కార్తీక్ 41 నాటౌట్; జోసెఫ్ 2/46), వెస్టిండీస్: 20 ఓవర్లలో 122/8 (బ్రూక్స్ 20; అశ్విన్ 2/22, అర్శ్దీప్ 2/24, రవి 2/26)