ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ ను నెగ్గాలని భావిస్తే భారత తుది జట్టులో ఎవరు ఆడాలనేదానిపై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కీలక సూచన చేశాడు. వికెట్ కీపర్ల విషయంలో రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ లలో ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై జోరుగా చర్చ సాగుతున్న వేళ స్టెయిన్.. తుది జట్టులో దినేశ్ కార్తీక్ పేరు కచ్చితంగా ఉండాలని సూచించాడు.
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టెయిన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో రిషభ్ పంత్ కు నాలుగు మ్యాచులలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. కానీ అతడు మాత్రం పదే పదే చేసిన తప్పులు మళ్లీ చేస్తూ వికెట్ ను కోల్పోతున్నాడు. అత్యుత్తమ ఆటగాళ్లు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు. కానీ పంత్ ను చూస్తే అలా కనిపించడం లేదు..
అయితే అదే సమయంలో డీకే (దినేశ్ కార్తీక్) మాత్రం తనకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రతీ మ్యాచ్ లో అతడు తన క్లాస్ ను చూపిస్తున్నాడు. మీరు (టీమిండియా) ప్రపంచకప్ గెలవాలని భావిస్తే సూపర్ ఫామ్ లో ఉన్న దినేశ్ కార్తీక్ ను తుది జట్టులోకి తీసుకోండి.
డీకే ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్నాడు. అతడు ఇదే ఫామ్ ను గనక కొనసాగిస్తే.. ఈ ప్రపంచకప్ లో భారత జట్టుతో పాటు ఆసీస్ విమానం ఎక్కబోయే ఆటగాళ్ల జాబితాలో అతడుంటాడు..’ అని తెలిపాడు. స్టెయిన్ తో పాటు గతంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా కార్తీక్ ను టీ20 ప్రపంచకప్ కు ఎంపికచేయాలని సూచించారు.