Rishabh Pant : భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు యాక్సిడెంట్కు గురి కావడంపై వస్తున్న తప్పుడు వార్తలను పోలీసులు ఖండించారు. ‘మేము 8-10 స్పీడ్ కెమెరాలను పరిశీలించాం. ఒకవేళ పంత్ మద్యం సేవించి ఉంటే ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరం ఒక్క యాక్సిడెంట్ కూడా చేయకుండా కారు ఎలా నడపగలడు? కారు ప్రమాదానికి గురైనప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు అతనికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యుడు వెల్లడించాడు. పంత్ మద్యం సేవించలేదు కాబట్టి కారు లోంచి బయటకు రాగలిగాడు. ఆ టైమ్లో తాగినవాళ్లు కారు నుంచి బయటకు రాలేరు’ అని హరిద్వార్ సీనియర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు.
‘ఉత్తరప్రదేశ్ సరిహద్దు నుంచి యాక్సిడెంట్ జరిగిన నస్రన్ ప్రాంతం వరకు 8-10 స్పీడ్ కెమెరాలను పరిశీలించాం. గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితిని పంత్ అతిక్రమించలేదు. అయితే.. డివైడర్ను ఢీకొట్టిన సమయంలో కారు అతి వేగంతో ఉంది. అందుకనే గాల్లో పల్టీ కొట్టింది. మా టెక్నికల్ టీమ్ యాక్సిడెంట్ జరిగిన స్థలానికి వెళ్లింది. అక్కడ ఓవర్ స్పీడ్కు సంబంధించిన ఆధారాలు ఏవీ లభించలేదు’ అజయ్ సింగ్ వెల్లడించారు. పంత్ నిద్రమత్తులో ఉండడం వల్లనే యాక్సిడెంట్ జరిగినట్టు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.
ప్రస్తుతం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో పంత్ చికిత్స పొందుతున్నాడు. అతనికి ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. రూర్కీలోని మొహమ్మద్పూర్ జాట్ అనే ప్రాంతంలో పంత్ డ్రైవ్ చేస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు శుక్రవారం (డిసెంబర్ 30న) ఉదయం డివైడర్ను ఢీకొట్టింది. వెంటనే కారులో మంటలు వ్యాపించాయి. దాంతో పంత్ విండో బద్దలు కొట్టుకొని సంగ వరకు బయటకు వచ్చాడు. ఆ దారిలో వెళ్తున్న బస్సు డ్రైవర్, మరికొందరు పంత్ను పూర్తిగా బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు.