హరారే: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో ఓటమన్నదే లేకుండా సాగుతున్న యువ భారత్.. సెమీస్లోనూ అదే జోరును కొనసాగించి టోర్నీలో వరుసగా ఆరోసారి ఫైనల్ చేరింది. రెండో సెమీస్లో ఆయుష్ మాత్రె సారథ్యంలోని భారత్-19 జట్టు.. ఆఫ్ఘానిస్థాన్పై 7 వికెట్ల తేడాతో గెలిచి మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా ఏకంగా పదోసారి ఫైనల్ ఆడనుంది. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 311 పరుగుల ఛేదనలో హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (104 బంతుల్లో 115, 15 ఫోర్లు, 2 సిక్స్లు) శతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
సంచలనాల వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68, 9 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ ఆయుష్ మాత్రె (59 బంతుల్లో 62, 5 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకాలతో రాణించగా లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. ఫైజల్ షినోజాదా (93 బంతుల్లో 110, 15 ఫోర్లు), ఉజైరుల్లా (86 బంతుల్లో 101, 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలు చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 310 రన్స్ చేసింది. ఈనెల 6వ తేదీన ఇదే వేదికగా జరుగబోయే ఫైనల్లో భారత్.. ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఆఫ్ఘాన్ బ్యాటర్లలో ఇద్దరు శతకాలు చేసి ప్రత్యర్థి ఎదుట రికార్డు లక్ష్యాన్ని నిలిపినా.. భారత ఇన్నింగ్స్ ఎక్కడా ఒడిదొడుకులకు లోనుకాలేదు. తొలి బంతినే బౌండరీతో ఆరోన్ ఛేదనను ఆరంభించగా మెరుపుల వీరుడు వైభవ్ తనదైన శైలిలో ఆఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జద్రాన్, అజిజ్ను లక్ష్యంగా చేసుకుని మెరుపులు మెరిపించాడు. 24 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తిచేసిన వైభవ్.. ధాటిగా ఆడే క్రమంలో నిష్క్రమించినా అతడి స్థానంలో వచ్చిన మాత్రెతో కలిసి ఆరోన్ ఇన్నింగ్స్ను నడిపించాడు.
మాత్రె మధ్యమధ్యలో బౌండరీలు, సిక్స్లతో రన్రేట్ వేగాన్ని పడిపోకుండా చూస్తే ఆరోన్ అతడికి పూర్తి సహకారం అందించాడు. అతడితో పాటు మాత్రె హాఫ్ సెంచరీలతో భారత స్కోరు 26 ఓవర్లకే 200 పరుగుల మార్కును దాటింది. 27వ ఓవర్లో మాత్రెను ఒమర్జాయ్ ఔట్ చేసినా విహాన్ (38*)తో జతకలిసిన హైదరాబాదీ బ్యాటర్.. అజిజ్ ఓవర్లో రెండు బౌండరీలతో 90లలోకి వచ్చాడు. ఖత్రి ఓవర్లో మిడాన్ దిశగా ఫోర్ కొట్టి శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. విజయానికి 10 రన్స్ దూరంలో అతడు ఔట్ అయినా విహాన్, వేదాంత్ (4*) లాంఛనాన్ని పూర్తిచేశారు.
ఆఫ్ఘానిస్థాన్: 50 ఓవర్లకు 310/4 (ఫైజల్ 110, ఉజైరుల్లా 101*, కనిష్క్ 2/55, ఖిలాన్ 2/64); భారత్: 41.1 ఓవర్లలో 311/3 (ఆరోన్ 115, వైభవ్ 68, ఒమర్జాయ్ 2/64, జద్రాన్ 1/67)
ఇప్పటిదాకా 16 సార్లు అండర్-19 ప్రపంచకప్ జరిగితే అందులో 10 సార్లు భారత్ ఫైనల్ చేరింది. టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన టీమ్ఇండియా.. 2000, 2008, 2012, 2018, 2022లో టైటిల్స్ గెలిచింది. 2016 నుంచి ప్రతి ఎడిషన్లోనూ ఫైనల్కు చేరుకుంది.