హైదరాబాద్: పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు స్కోర్ బోర్డును పరుగులు తీయించింది. తొలి మూడు వికెట్లు వెంటవెంటనే కోల్పోయినప్పటికీ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ క్రీజులో కుదురుకుని పరుగుల వరద పారించారు. దాంతో ప్రత్యర్థి నెదర్లాండ్స్ ముందు పాకిస్థాన్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. 49 ఓవర్లలో 286 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
అంతకుముందు టాస్ గెలిచిన నెదర్లాండ్స్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుని పాకిస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. బ్యాటింగ్కు దిగిన పాక్ ఓపెనర్లు ఫఖార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ కుదురుకున్నట్టే కనిపించారు. కానీ నాలుగో ఓవర్లో జమాన్ (12) ఔట్ కాగానే కెప్టెన్ బాబర్ ఆజమ్ వన్డౌన్గా క్రీజులోకి వచ్చాడు. కేవలం 5 పరుగులు చేసి తొమ్మిదో ఓవర్లో పెవిలియన్కు చేరాడు. ఆ వెంటనే పదో ఓవర్లో మరో ఓపెనర్ ఇమామ్ (15) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు.
అనంతరం క్రీజులో అడుగుపెట్టిన కీపర్ మహ్మద్ రిజ్వాన్ (68), సౌద్ షకీల్ (68) క్రీజులో నిలదొక్కుకుని పరుగుల వరద పారించారు. 29వ ఓవర్లో 158 పరుగుల వద్ద షకీల్ ఔట్ కావడంతో వారి పార్ట్నర్షిప్కు బ్రేక్ పడింది. జట్టు స్కోర్ 182 వద్ద 32వ ఓవర్లో రిజ్వాన్ రనౌట్ అయ్యాడు. అప్పటికి పాకిస్థాన్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు. ఆ తర్వాత బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోయినా మహ్మద్ నవాజ్ (39), షాదాబ్ ఖాన్ (32) పర్వాలేదనిపించారు. చివరి 49 ఓవర్లలో 286 పరుగుల వద్ద పాక్ ఆలౌట్ అయ్యింది. డచ్చి బౌలర్లలో బాస్ డీ లీడ్ 9 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కోలిన్ అకెర్మాన్ 2 వికెట్లు తీశాడు.