ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 పురుషుల ప్రపంచకప్లో యువ భారత బౌలర్లు మరోసారి సత్తా చాటారు. ఈ టోర్నీ ఆరంభం నుంచీ అదరగొడుతున్న భారత బౌలర్లు సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి సెమీస్లో కట్టుదిట్టంగా బంతులేసి సఫారీలను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. బెనోని లోని విల్లోమోర్ పార్క్ వేదికగా జరగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ప్రొటీస్ టీమ్లో లువాన్ డ్రి ప్రిటోరియస్ (102 బంతుల్లో 76, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రిచర్డ్ సెలెట్స్వేన్ (100 బంతుల్లో 64, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో లింబాని (3/60) మూడు వికెట్లు తీయగా, ముషీర్ ఖాన్ (2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ సౌమి పాండే (1-38) పొదుపుగా బౌలింగ్ చేశాడు.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు ఐదో ఓవర్లోనే తొలి వికెట్ను కోల్పోయారు. ఓపెనర్ స్టీవ్ స్టాక్ (14)ను రాజ్ లింబాని ఔట్ చేశాడు. వన్ డౌన్లో వచ్చిన డేవిడ్ టీగర్ పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించాడు. 46 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన సఫారీలను ప్రిటోరియస్ – రిచర్డ్లు ఆదుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్కు 72 పరుగులు జోడించారు. భారీ షాట్లు ఆడకపోయినా వికెట్లు కాపాడుకుంటూ చాపకింద నీరులా సాగుతున్న ఈ జోడీని ముషీర్ ఖాన్ విడదీశాడు. అతడు వేసిన 30వ ఓవర్లో రెండో బంతికి ప్రిటోరియస్.. మురుగన్ అభిషేక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ప్రిటోరియస్ ఔట్ అయినా రిచర్డ్.. ఒలీవర్ వైట్హెడ్ (22) తో కలిసి నాలుగో వికెట్కు 45 పరుగులు జోడించాడు. ఒలీవర్ను కూడా ముషీర్ ఖాన్ ఔట్ చేశాడు. అర్థ సెంచరీ చేసుకున్నాక రిచర్డ్.. నమన్ తివారి బౌలింగ్లో ప్రియాన్షుకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఖర్లో కెప్టెన్ జువాన్ జేమ్స్ (19 బంతుల్లో 24, 1 ఫోర్, 1 సిక్సర్), ట్రిస్టన్ లుస్ (12 బంతుల్లో 23 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో సఫారీ స్కోరుబోర్డు 244లకు చేరింది.
50 ఓవర్లలో భారత్.. 245 పరుగులు చేయగలిగితే ఈ టోర్నీలో ఫైనల్ చేరే తొలి జట్టుగా ఉదయ్ సేన నిలవనుంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత బ్యాటర్లు ఛేదనలో ఏం చేస్తారో మరి..!