ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్లో యువ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. బ్లూమ్ఫోంటైన్ స్టేడియంలో భారత్ – ఐర్లాండ్ మధ్య ముగిసిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఏడు వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆ జట్టు 29.4 ఓవర్లలో సరిగ్గా వంద పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత యువ పేసర్ నమన్ తివారి నాలుగు వికెట్ల (4/53)తో చెలరేగగా స్పిన్నర్ సౌమీ పాండే మూడు వికెట్లు (3/21) పడగొట్టాడు.
లక్ష్య ఛేదనలో ఐర్లాండ్కు ఆరో ఓవర్లో తొలి దెబ్బ తాకింది. ఓపెనర్ జోర్డాన్ నీల్ (11)ను సౌమీ పాండే బౌల్డ్ చేయడంతో ఐర్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ ర్యాన్ హంటర్ (13) ను తివారి ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో వరుసగా ఆరుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో ఆ జట్టు 14.1 ఓవర్లలో 45 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో లోయరార్డర్ బ్యాటర్లు ఒలీవర్ రిలే (15), డేనియల్ ఫార్కిన్ (27 నాటౌట్)లు ఆ జట్టు పరువు నిలిపారు. ఈ ఇద్దరూ 9వ వికెట్కు 39 పరుగులు జోడించారు. వికెట్లకు అడ్డునిలిచిన రిలేను మురుగన్ అభిషేక్ ఎల్బీగా వెనక్కిపంపడంతో ఆ జట్టు తొమ్మిదో వికెట్ను కోల్పోయింది. ఆఖరి బ్యాటర్ ఫిన్ లటన్ (7)ను ఉదయ్ సహరన్ బౌల్డ్ చేసి ఐర్లాండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు. ఫలితంగా భారత్.. 201 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సెంచరీ చేసిన ముషీర్ ఖాన్ (118)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
2⃣ in 2⃣ for #BoysinBlue 😎
A fine 4-wicket haul from Naman Tiwari helps #TeamIndia register a 201-run win over Ireland U19.
📸 ICC/Getty Images
Scorecard ▶️ https://t.co/x26Ah72jqU#INDvIRE | #U19WorldCup pic.twitter.com/te6Oy2FQfX
— BCCI (@BCCI) January 25, 2024
ఈ టోర్నీలో బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచిన యువ భారత్కు ఇది రెండో విజయం. భారత్ తమ తర్వాతి మ్యాచ్ను ఈనెల 28న యూనైటెడ్ స్టేట్స్తో ఆడనుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలోని గ్రూప్ – ఎలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ విజయంతో భారత్ సూపర్ సిక్స్ బెర్త్నూ ఖాయం చేసుకుంది.