ICC Under – 19 World Cup 2024: రెండు నెలల క్రితమే భారత్లో ముగిసిన వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో ప్రతిష్టాత్మక ట్రోఫీతో సిద్ధమైంది. శుక్రవారం (జనవరి 19) నుంచి సౌతాఫ్రికా గడ్డపై అండర్ – 19 వరల్డ్ కప్ ఆరంభంకానుంది. 15వ ఎడిషన్గా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. పలు మార్పులు, చేర్పులు, కొత్త నిబంధనలతో సిద్ధమైన ఈ టోర్నీలో తొలి మ్యాచ్.. బుధవారం ఐర్లాండ్ – యూఎస్ఏ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రోఫీపై ఆసక్తికర విషయాలివిగో….
ఈ ఏడాది శ్రీలంకలో జరగాల్సి ఉన్న అండర్ – 19 వరల్డ్ కప్ ఆ దేశం నిషేధం ఎదుర్కుంటుండటంతో సౌతాఫ్రికాకు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలోని ఆరు వేదికల (పొచెఫ్స్ట్రోమ్, బ్లూమ్ఫోంటెన్, కింబర్లీ, ఈస్ట్ లండన్, బెనొని (2 వేదికలు))లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. 16 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో.. జట్లను నాలుగు గ్రూపులుగా విడగొట్టారు. టీమిండియా గ్రూప్ – ఎ లో ఉంది.
గ్రూపుల వివరాలు
గ్రూప్ – ఎ : భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్ఎ
గ్రూప్ – బి : ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్
గ్రూప్ – సి : ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా
గ్రూప్ – డి : అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్
షెడ్యూల్..
16 జట్లు నాలుగు గ్రూపులుగా తలపడుతున్న ఈ టోర్నీలో జనవరి 19 నుంచి తొలి దశ పోటీలు జరుగుతాయి. ఈనెల 28 వరకు తొలి రౌండ్ పోటీలుంటాయి. ప్రతి గ్రూపులో టాప్ -3లో ఉన్న జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుతాయి. సూపర్ సిక్స్లో కూడా మళ్లీ నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ఈ దశలో ప్రతి గ్రూపులో టాప్ లో ఉన్న జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఫిబ్రవరి 03 దాకా ఈ పోటీలు సాగుతాయి. ఇక ఫిబ్రవరి 06, 08న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 11న బెనొనిలోని విల్లోమూర్ పార్క్ వేదికగా తుది పోరు జరుగునుంది.
భారత మ్యాచ్ల తేదీలు..
ఈ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్ తొలి మ్యాచ్ను ఈనెల 20న బంగ్లాదేశ్తో ఆడనుంది. గ్రూప్ దశలో భారత్ మూడు మ్యాచ్లు ఆడనుంది.
జనవరి 20 : బంగ్లాదేశ్తో
జనవరి 25 : ఐర్లాండ్తో
జనవరి 28 : యూఎస్ఎతో మ్యాచ్లు ఉన్నాయి.
అండర్ – 19 వరల్డ్ కప్లో భారత జట్టుకు ఉదయ్ సహరన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. జట్టు వివరాలు
భారత జట్టు : అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహరన్ (కెప్టెన్), ఎరవెల్లి అవినాశ్ రావు, సౌమ్య కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి
లైవ్ చూడటమిలా…
దక్షిణాఫ్రికాలో జరుగనున్న ఈ టోర్నీ లైవ్ ప్రసారాలను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడొచ్చు. యాప్లో అయితే డిస్నీ హాట్ స్టార్లో మ్యాచ్లను వీక్షించొచ్చు. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్లు మొదలవుతాయి.