ODI WC 2023 : భారత క్రికెట్ బోర్డు వరల్డ్ కప్(ODI WC 2023) షెడ్యూల్లో మార్పులకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఐసీసీ బృందం(ICC Team) ఒకటి ఇండియాకు వచ్చింది. ఇందులో భద్రతా అధికారులు, ఈవెంట్, బ్రాడ్కాస్ట్ రంగంలో నిపుణులైన వాళ్లు ఉన్నారు. వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న స్టేడియాల(World Cup Stadiums)పైఈ టీమ్ రెక్కీ నిర్వహించనుంది. ఆయా స్టేడియాల్లో ఏర్పాట్లు, వసతులతో పాటు భద్రతా పరమైన చర్యల గురించి కూడా ఓ నిర్ణయానికి రానుంది.
ధీరజ్ మల్హోత్రా(Dhiraj Malhotra) నేతృత్వంలోని ఈ బృందం ఇప్పటికే ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో ఏర్పాట్లను పరిశీలించి, అక్కడి సౌకర్యాలు బాగున్నాయంటూ కితాబిచ్చింది. ప్రస్తుతం ఐసీసీ టీమ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో తనిఖీలు చేస్తోంది.
వరల్డ్ కప్ టోర్రీకి మరో రెండు నెలలు మాత్రమే ఉన్నాయి. దాంతో, భద్రతా పరమైన ఏర్పాట్ల గురించి ఐసీసీ ఆరా తీయాలనుకుంది. అందుకని సెక్యూరిటీ, ఈవెంట్స్, బ్రాడ్కాస్ట్ ఎక్స్పర్ట్స్తో కూడిన బృందాన్ని ఈనెల 25న ముంబైకి పంపింది. వాంఖడే స్టేడియం పరిశీలన పూర్తయ్యాక ఐసీసీ టీమ్ జూలై 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం, వామప్ మ్యాచ్లకు వేదికైన త్రివేండ్రం స్టేడియంలో కలియదిరిగింది. 27న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంను తేరిపారా చూసింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం
ఐసీసీ బృందం స్టేడియంలో ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిందని తమిళనాడు, కర్నాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులు చెప్తున్నారు. ఐసీసీ టీమ్ జూలై 31న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి రానుంది. ఆ తర్వాత ఢిల్లీ, ధర్మశాల, లక్నో, కోల్కతా, గువాహటి స్టేడియాలను పరీశీలించనుంది.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత గడ్డపై జరుగనుంది. దాంతో, ఇప్పటికే బీసీసీఐ కళ తప్పిన స్టేడియాల మరమ్మతు, సుందరీకరణ కోసం కోట్లు ఖర్చు పెట్టింది. వీటిలో ఈడెన్ గార్డెన్స్, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం, ముంబైలోని వాంఖడే స్టేడియాలు ఉన్నాయి. అక్టోబర్ 5న ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. తొలి పోరు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉండనుంది. ఈ ఏడాది సెమీ ఫైనల్స్కు కూడా ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించడం విశేషం. దాయాదులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14 లేదా 15వ తేదీల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది.