ICC ODI Rankings : ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసిన వన్డే ఇంటర్నేషనల్ (ODI) ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి టాప్-5కి చేరుకున్నాడు. ఇప్పటిదాకా ఆరోస్థానంలో ఉన్న కోహ్లీ.. ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక శుభ్మాన్ గిల్ (Shubman Gill), బాబర్ అజామ్ (Babar Azam), రోహిత్ శర్మ (Rohit Sharma), హెన్రిచ్ క్లాసెన్ (Henrich Klasen) వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. శుభ్మాన్ గిల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేగాక రెండో స్థానంలో ఉన్న అజామ్కు, తనకు మధ్క పాయింట్ల గ్యాప్ను పెంచాడు.
గతంలో గిల్కు, అజామ్కు 23 పాయింట్ల గ్యాప్ ఉండగా.. ఇప్పుడు ఆ గ్యాప్ 47 పాయింట్లకు పెరిగింది. ఇక భారత మరో యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ 9వ ర్యాంకులోనే కొనసాగుతుండగా.. కేఎల్ రాహుల్ రెండు స్థానాలు మెరుగై 15వ ర్యాంక్కు చేరుకున్నాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్లో శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో రషీద్ ఖాన్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. అయితే గాయం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే జట్టులో రాణిస్తున్న టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం రెండు స్థానాలు దిగజారి 12వ ర్యాంకుకు పడిపోయాడు. షమీ ఒక స్థానం మెరుగై 14వ ర్యాంకుకు చేరాడు.
ఇదిలావుంటే ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టాప్-10లో ఈ సారి ఎలాంటి మార్పులు లేవు. అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ నబీ టాప్ పొజిషన్లో ఉండగా.. భారత ఆటగాడు రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మైకేల్ బ్రాస్వెల్ ఏకంగా 26 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్కు చేరుకున్నాడు. కాగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్తో మ్యాచ్లో సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలకు తాజా శతకంతో సమాధానమిచ్చాడు.
విరాట్కు ఇది వన్డేల్లో 52వ సెంచరీ కాగా.. ఓవరాల్గా 82వ సెంచరీ. అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లీ కంటే ముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెందూల్కర్ (100 సెంచరీలు) ఉన్నాడు.