Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె కేంద్ర ప్రభుత్వం తనకు అందజేసిన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నతో పాటు అర్జున అవార్డులను వాపస్ ఇచ్చేస్తున్నట్టు తెలిపింది. కొద్దిసేపటి క్రితమే ఆమె ఎక్స్ (ట్విటర్) వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ట్విటర్లో ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాస్తూ.. ‘నేను నా ఖేల్రత్న, అర్జున అవార్డులను వాపస్ ఇచ్చేస్తున్నా’ అని అందులో పేర్కొంది. బజరంగ్ పునియా తర్వాత అవార్డును ప్రభుత్వానికి తిరిగిచ్చేసిన రెజ్లర్ల జాబితాలో ఫోగాట్ రెండో క్రీడాకారిణి. బధిరుల ఒలింపిక్స్లో మూడు స్వర్ణాలు నెగ్గిన విజేందర్ సింగ్ కూడా సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి తప్పుకున్నాక తన అర్జున అవార్డును వాపస్ ఇచ్చేస్తానని ప్రకటించినా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అతడు దీనిపై ఎటువంటి ప్రకటనా చేయలేదు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలతో పలువురు రెజ్లర్లు తీవ్ర కలత చెందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ గెలుపొందిన వెంటనే సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగా బజరంగ్ పునియా తన అర్జున అవార్డును వెనక్కిచ్చేశాడు. ఈ పరిణామాలతో అలర్ట్ అయిన కేంద్రం.. సంజయ్ సింగ్ ప్యానెల్ను సస్పెండ్ చేసింది. రెండు రోజుల క్రితమే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కూడా తనకు రెజ్లింగ్తో ఏం సంబంధం లేదని, ఈ ఆటకు ఇక సెలవు అని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ను తప్పిస్తే ఈ అంశం చల్లారుతుందని భావించినా వినేశ్ ఫోగాట్ తాజా ప్రకటనతో ఈ చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదని తెలుస్తున్నది.
मैं अपना मेजर ध्यानचंद खेल रत्न और अर्जुन अवार्ड वापस कर रही हूँ।
इस हालत में पहुँचाने के लिए ताकतवर का बहुत बहुत धन्यवाद 🙏 pic.twitter.com/KlhJzDPu9D
— Vinesh Phogat (@Phogat_Vinesh) December 26, 2023
లేఖలో పోగాట్.. ‘డీయర్ ప్రైమ్ మినిస్టర్.. సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి తప్పుకుంది. బజరంగ్ పునియా అర్జున అవార్డును తిరిగిచ్చేశాడు. ఇందుకు గల కారణాలు ఏంటో దేశం మొత్తానికి తెలుసు. ఈ దేశానికి నాయకుడిగా మీకు కూడా ఈ విషయాలు తెలిసే ఉండాలి. నేను వినేశ్ ఫోగాట్. మీ దేశపు ఆడబిడ్డను. ఏడాదికాలంగా నేను పడుతున్న ఆవేదనను తెలియజేయడానికి ఈ లేఖను రాస్తున్నా.. 2016లో సాక్షి ఒలింపిక్ మెడల్ గెలిచిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడే మీ ప్రభుత్వం.. ఆమెను ‘బేటీ బచావో బేటీ పడావో’ కు బ్రాండ్ అంబాసిడర్ను చేసింది. అప్పుడు ఈ దేశపు ఆడబిడ్డగా నేనేంతో సంతోషించా. తాజాగా సాక్షి రెజ్లింగ్ నుంచి తప్పుకుంది. మా మహిళా అథ్లెట్లు ప్రభుత్వం అడ్వర్టయిజ్మెంట్స్లో ప్రకటించడానికేనా..? నాకు ఒలింపిక్ పతకం గెలవాలని లక్ష్యం. కానీ ఇప్పుడు అది కలగానే మిగిలిపోయింది. ఈ ప్రోగ్రాంలో మీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్యాన్సీ ప్లెక్సీలు ఫేడ్ అవుట్ అయ్యాయి. సాక్షి కూడా ఆట నుంచి తప్పుకుంది. మమ్మల్ని అణగదొక్కాలని చూసినవ్యక్తి ఈ ఆటలో తాను లేకున్నా ఆటను డామినేట్ చేస్తానని బహిరంగంగానే చెప్తున్నాడు. మీ బిజీ డే లైఫ్లో ఓ ఐదు నిమిషాలైన వెచ్చించి ఆ వ్యక్తి (బ్రిజ్ భూషణ్ను ఉద్దేశిస్తూ) ఏం చెప్తున్నాడో వినండి. అప్పుడు ఆయన ఏం చేశాడో మీకు తెలుస్తుంది. మమ్మల్ని అణగదొక్కడానికి ఆయన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఆయన కారణంగానే చాలా మంది మహిళా రెజ్లర్లు ఈ ఆట నుంచి వెనుకడుగువేశారు..’ అని మోడీకి రాసిన లేఖలో పేర్కొంది.