న్యూఢిల్లీ: టీమిండియా వండర్ఫుల్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రతి ఒక్కరికీ హ్యాప్పీ దీపావళి శుభాకాంక్షలని కోహ్లీ పేర్కొన్నాడు. అదేవిధంగా ఇవాళ పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ గురించి విరాట్ మాట్లాడాడు. ఇవాళ పాకిస్థాన్పై ఆడిన ఇన్నింగ్స్ తన అత్యుత్తమమైన ఇన్నింగ్స్లో ఒకటని చెప్పాడు.
ఇలాంటి ముఖ్యమైన గేమ్స్ ఆడటం తన అదృష్టమన్నాడు కోహ్లీ. ఇతర మ్యాచ్లతో పోల్చితే ఈ మ్యాచ్ చాలా భిన్నమైనదని తెలిపాడు. ఇవాళ పాకిస్థాన్ జట్టుపై తాము విజయం సాధించినందున దేశ ప్రజలంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ప్రస్తుతం సూపర్-12 మ్యాచ్లు జరుగుతున్నాయి. మొత్తం 12 జట్లు రెండు గ్రూప్లుగా సూపర్-12లో పోటీపడుతున్నాయి.
ఇవాళ టోర్నీలో తన తొలి మ్యాచ్ను పాకిస్థాన్తో ఆడిన భారత్.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.