దుబాయ్: పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది విరాట్ కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమని.. దాని వెనుక బోర్డు ఒత్తిడి లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్ అనంతరం విరాట్ టీ20 కెప్టెన్సీ పగ్గాలు వదిలేస్తున్నట్లు ముందే ప్రకటించగా.. శుక్రవారం ఈ అంశంపై దాదా స్పందిస్తూ.. ‘విరాట్ నిర్ణయంతో ఆశ్చర్యపోయా. ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో ఉన్నప్పుడు కోహ్లీ ఈ విషయం చెప్పాడు. అంతకుముందు ఈ అంశంపై అతడితో చర్చించలేదు. బోర్డు తరఫు నుంచి ఎలాంటి ఒత్తిడి తేలేదు’ అని అన్నాడు. మూడు ఫార్మాట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మెరుగైన ప్రదర్శన చేయడం మామూలు విషయం కాదని దాదా పేర్కొన్నాడు. ‘సుదీర్ఘ కాలం పాటు మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడం మామూలు విషయం కాదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గంగూలీ, ధోనీ, విరాట్ ఎవరైనా దాన్ని ఎదుర్కోక తప్పదు’ అని అన్నాడు. మెంటార్గా ఎంపిక చేయడానికి ముందే ధోనీ విషయంలో చాలా ఆలోచించామన్న గంగూలీ.. అతడి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.