Hardik Pandya | ప్రస్తుతం ఐపీఎల్ – 17 ప్రిపరేషన్స్లో ఉన్న ఆ జట్టు సారథి, టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2023లో భారత్ వేదికగానే నిర్వహించిన వన్డే ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్లో కాలి మడమ గాయంతో ఇబ్బందిపడ్డ పాండ్యా.. ఆ తర్వాత టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గాయం తీవ్రత నేపథ్యంలో అతడు వరల్డ్ కప్తో పాటు ఆ తర్వాత భారత్ ఆడిన మిగతా సిరీస్లకూ దూరంగా ఉన్నాడు. సుమారు ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ ఫీల్డ్లోకి అడుగుపెడుతున్న అతడు.. ఐపీఎల్ టీవీ ప్రసారహక్కులు కలిగిన ‘స్టార్’లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి ఐదారురోజుల్లో తిరిగొస్తానని టీమ్ మేనేజ్మెంట్కు చెప్పానని కానీ విధి మాత్రం మరోలా తలచిందని చెప్పుకొచ్చాడు.
పాండ్యా మాట్లాడుతూ.. ‘నేను వరల్డ్ కప్ కోసం ఏదో 2-3 నెలలుగా ప్రిపేర్ కాలేదు. సుమారు ఏడాదికాలంగా ప్రపంచకప్ కోసం సిద్ధమయ్యా. ఆ మేరకు నా షెడ్యూల్ను ప్లాన్ చేసుకున్నా. కానీ గాయం మాత్రం నా ఆశలపై నీళ్లు చల్లింది. చాలా తక్కువ మందికి మాత్రమే నా గాయం గురించి తెలుసు. వాస్తవానికి నాకు గాయమైనప్పుడు 20-25 రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని అనుకున్నా. కానీ అది నిత్యం వాయిదాపడుతూ నా రికవరీని లేట్ చేసింది. ఒకరకంగా చెప్పాలంటే నాకు ఇది పూర్తిగా కమ్ బ్యాక్ వంటిది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయమై నేను జట్టును వీడేప్పుడు టీమ్ మేనేజ్మెంట్తో ఐదు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పా. కానీ వరల్డ్ కప్తో పాటు నాలుగు నెలలు వేచి చూడాల్సి వచ్చింది..’ అని అన్నాడు.
అంతేగాక కాలి మడమ గాయం వల్ల తాను కనీసం నడవలేకపోయేవాడినని చెప్పిన పాండ్యా.. తాను వీలైనంత త్వరగా కోలుకునేందుకు చాలా కష్టపడ్డానని తెలిపాడు. నడక కష్టమైనా ఆ నొప్పి తెలియకుండా ఉండేందుకు గాను పెయిన్ కిల్లర్స్ వాడానని, ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. దేశం తరఫున ఆడటం ఎప్పుడూ గౌరవంగా భావించానని, కానీ వరల్డ్ కప్ మిస్ చేసుకున్నందుకు మాత్రం చాలా బాధపడ్డానని పాండ్యా తెలిపాడు.