ఐపీఎల్లో వివాదాలేమీ కొత్తకాదు. కానీ తొలి సీజన్లోనే తన సహచర ఆటగాడు, టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ చెంప చెల్లుమనిపించడంతో హర్భజన్ సింగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఆ వివాదం కారణంగా భజ్జీ పలు మ్యాచులలో నిషేధానికీ గురయ్యాడు. సుదీర్ఘ కాలం తర్వాత భజ్జీ ఇప్పుడు మళ్లీ ఆ ఘటనకు సంబంధించి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని, అలా చేసి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించాడు.
తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అప్పుడేదైతో జరిగిందో అది చాలా తప్పు. నేను తప్పు చేశాను. నా వల్ల, నా తోటి ఆటగాడు చాలా ఇబ్బందిపడ్డాడు. అది నాకు కూడా సిగ్గుగా అనిపించింది. నా జీవితంలో నేనేదైనా సరిదిద్దుకోవాల్సి వస్తే.. అది కచ్చితంగా ఇదే అవుతుంది..
శ్రీశాంత్తో నేను ఆరోజు అలా ప్రవర్తించి ఉండకూడదు. ఆ ఘటన గురించి నేనెప్పుడు తలుచుకున్నా మనసంతా ఏదో వెలితిగా ఉంటుంది. అసలు ఇలా జరగాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది…’ అని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
కాగా హర్భజన్తో పాటు బాధిత శ్రీశాంత్ కూడా ఈ లైవ్లో పాల్గొన్నాడు. భజ్జీ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం అతడు స్పందిస్తూ.. హర్భజన్ తనకు అన్నవంటి వాడని.. భజ్జీతో తనకు ఇప్పుడెలాంటి విబేధాలు లేవని చెప్పుకొచ్చాడు. 2008 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ – పంజాబ్ కింగ్స్ ఎలవెన్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. భజ్జీ తన చెంప ఛెల్లుమనిపించాడని మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ కన్నీరుపెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ ఈ ఇద్దరినీ పిలిచి విందు ఏర్పాటు చేసి వివాదం సద్దుమణిగేలా చేశాడని గతంలో శ్రీశాంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ వివాదం కారణంగా భజ్జీ.. దాదాపు 11 మ్యాచుల (ఐపీఎల్ లో ఆరు, టీమిండియా తరఫున 5) పాటు నిషేధానికి గురయ్యాడు. 2011లో ఈ ఇద్దరూ కలిసి వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో సభ్యులు.