టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీ (బీజేపీ)గా ఉన్న గౌతం గంభీర్ తాను ఐపీఎల్లో ఎందుకు భాగమవుతున్నాననే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంపీగా ఉండి ఐపీఎల్గానీ కామెంటరీగానీ ఎందుకు చెబుతున్నాడనే విమర్శలకు గంభీర్ దీటుగా సమాధానమిచ్చాడు. తాను నెలకు ఐదు వేల మంది పేదవాళ్లకు తిండి పెడుతున్నానని, తన ఇంట్లో డబ్బులు కాచే చెట్టేమీ లేదు కదా..? అని వ్యాఖ్యానించాడు.
గంభీర్ తాజాగా ఒక మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ‘చాలా మంది నేను ఐపీఎల్లో భాగం కావడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. నేను ప్రతీ నెలా రూ. 25 లక్షలు ఖర్చు చేసి 5 వేల మందికి భోజనం పెడుతున్నా. అంటే యేటా రూ. 2.75 కోట్లు. అదీగాక నా సొంత ఖర్చుతో రూ. 25 లక్షలు ఖర్చు చేసి లైబ్రరీ కట్టించా. మరి ఇవెలా నడవాలి..?
ఈ డబ్బులన్నీ నేను నా జేబు లోంచి ఖర్చు చేస్తున్నానే తప్ప ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక్క రూపాయి తీయడం లేదు. ఎంపీ ల్యాడ్స్ నుంచి వచ్చే నిధులతో నేను నా కిచెన్ నడపలేను. నా ఇంట్లో డబ్బులు కాచే చెట్టు కూడా లేదు. మరి నేనేం చేయాలి..? అందుకే నేను ఐపీఎల్లో పనిచేస్తున్నా. మెంటార్గా ఉండటానికైనా.. కామెంటేటర్గా పని చేయడానికైనా నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఎవరేమీ అనుకున్నా నా అంతిమ లక్ష్యం సేవ చేయడమే..’ అని అన్నాడు.
క్రికెట్ నుంచి తప్పుకున్నాక కొన్నాళ్లకు రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయిన గంభీర్.. గాంధీ నగర్లో ‘జన్ రసోయ్’ పేరిట భోజనశాలను ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఒక్క రూపాయికే కడుపునిండా తిండి పెడతారు. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు.