హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా శుక్రవారం తెలంగాణకు వచ్చిన తెలుగుబిడ్డ జస్టిస్ ఎన్వీ రమణకు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఘన స్వాగతం పలికారు. జస్టిస్ రమణ దంపతులను శాలువాతో సన్మానించిన సీఎం కేసీఆర్, వెండి వీణను బహూకరించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు సీజేఐకి గౌరవవందనం సమర్పించారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, గవర్నర్ భర్త సౌందర్రాజన్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకణ్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీజేఐ దంపతుల గౌరవార్థం శుక్రవారం రాత్రి గవర్నర్ తమిళిసై విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో హైకోర్టు ప్రధానన్యాయమూర్తి హిమాకోహ్లీ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఎయిర్పోర్టులో మంత్రి కేటీఆర్ స్వాగతం
సీజైఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి నుంచి సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, మంత్రి కేటీఆర్ సారథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. సీజేఐకి మంత్రి కేటీఆర్ శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. సీజేఐకి స్వాగతం పలికినవారిలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు కే కేశవరావు, సురేశ్రెడ్డి, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.