హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష సత్తాచాటుతున్నది. నిలకడైన ప్రదర్శనతో సెలెక్టర్ల నమ్మకాన్ని చూరగొంటున్నది. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన త్రిష..తాజాగా భారత ‘ఎ’ జట్టుకు ఎంపికైంది. ముంబై వేదికగా ఈ నెల 29 నుంచి ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో త్రిష చోటు దక్కించుకుంది.
ఇప్పటికే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ క్రికెటర్ టాపార్డర్లో బ్యాటింగ్కు తోడు ఉపయుక్తమైన బౌలర్గా కొనసాగుతున్నది. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు సాధించడంలోనే కాదు..లెగ్స్పిన్ బౌలింగ్తో అవసరమైన సమయంలో వికెట్లు తీయడంలోనూ త్రిష ప్రతిభ కనబరస్తున్నది. భారత ‘ఎ’ జట్టుకు కేరళకు చెందిన మిన్ను మణి కెప్టెన్గా వ్యవహరించనుంది. వయనాడ్కు చెందిన మిన్ను..ఆసియాగేమ్స్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యురాలు. వాంఖడే స్టేడియం వేదికగా ఈ నెల 29, డిసెంబర్ 1, 3 తేదీల్లో ఇంగ్లండ్ ‘ఎ’తో భారత్ తలపడుతుంది.