జకార్తా: అంతర్జాతీయ నగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్లో త్వరలోనే రయ్.. రయ్మంటూ ఫార్ములావన్ కార్లు దూసుకెళ్లనున్నాయి. అలాంటి ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్ కార్ల ఈవెంట్ ‘ఫార్ములా -ఈ’ రేసు మన నగర నడిబొడ్డున జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న తొలి దశ రేసు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మహేంద్ర రేసింగ్ సీఈవో దిల్బాగ్ గిల్ అనధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ నడిబొడ్డున ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేసు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం జకార్తాలో జరిగిన ఓ ఈవెంట్లో గిల్ హైదరాబాద్లో రేస్ నిర్వహణపై స్పందించారు. ‘ఫిబ్రవరి 11న రేసు ఉండనుంది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో నిత్యం చర్చలు జరుపుతున్నాం. దీనిపై అధికారిక ప్రకటన ఈ నెలలో వెలువడుతుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ చుట్టూ రేస్ నిర్వహించాలనుకుంటున్నాం. ఈ రేసుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఈవెంట్తో భారత్లో మోటార్స్పోర్ట్స్కు ఊతం లభిస్తుంది. భారత్లో అద్భుతమైన డ్రైవర్లు వెలుగులోకి వస్తున్నారు.
ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆతిథ్యం
ఫార్మాలా వన్ రేసుకు ఏమాత్రం తీసిపోని ఎలక్ట్రిక్ కార్ల ‘ఫార్ములా -ఈ’ రేసు 2014 నుంచి జరుగుతున్నది. లండన్, న్యూయార్క్, మెక్సికో, రోమ్ తదితర నగరాల్లో జరిగిన ఈ రేసుకు దేశంలో తొలిసారిగా హైదరాబాద్ వేదిక కానుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవతో పదో సీజన్కు భాగ్యనగరం ఆతిథ్యం ఇస్తున్నది. ఎలక్ట్రికల్ వెహికల్ (ఈవీ) హబ్గా రాష్ర్టాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఫార్మూలా ఈ రేస్ నిర్వహణకు గతంలో ‘ఫార్ములా ఈ అసోసియేషన్’, గ్రీన్కో సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ రేసు నిర్వహణకు నగరంలోని పీవీ నరసింహారావు మార్గ్ నెక్లెస్ రోడ్డు-ట్యాంక్బండ్ సర్క్యూట్, కేబీఆర్ పార్క్ సర్క్యూట్, గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ రోడ్లను పరిశీలించారు. ఆఖరికి పీవీ మార్గ్ వైపు మొగ్గు చూపినట్లు గిల్ మాటలను బట్టి అర్థమవుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ ప్రతిష్ఠాత్మక రేసు మన నగరంలో జరుగనుండడం విశేషం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలను వెనక్కి నెట్టి ఈ రేసుకు హైదరాబాద్ ఎంపికవడం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిదర్శనం.