హైదరాబాద్, ఆట ప్రతినిధి: జంట నగరాల క్రీడాభిమానులను అలరించేందుకు ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’ చాంపియన్షిప్ సర్వ హంగులతో సిద్ధమైంది. హుసేన్సాగర్ వేదికగా 35వ జాతీయ సెయిలింగ్ టోర్నీకి శుక్రవారం తెరలేవనుంది. భారత యాచింగ్ అసోసియేషన్(వైఏఐ) గుర్తింపు పొందిన ఈ టోర్నీని సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ సహ నిర్వహణలో ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి 120 మందికి పైగా సెయిలర్లు పోటీపడే అవకాశమున్న టోర్నీలో మూడు విభాగాలు(లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7)గా జరుగుతాయని ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్ వైస్ కమోడోర్ మేజర్ జనరల్ జేఎస్ సిదానా పేర్కొన్నారు.
బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఆసియా గేమ్స్కు సన్నాహక టోర్నీగా జరుగనున్న చాంపియన్షిప్లో జాతీయ ర్యాంకింగ్ను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఎంపిక ఉంటుంది. తెలంగాణ నుంచి ఈసారి సంజయ్, అజయ్, అశ్విని, కీర్తి..లేజర్ 4.7 విభాగంలో బరిలోకి దిగుతున్నారు. అత్యుత్తమ సెయిలింగ్ సౌకర్యాలు ఉన్న క్లబ్లో ఈఎమ్ఈ ఒకటి. ఇక్కడి నుంచి ప్రతిభ కల్గిన మరింత మంది సెయిలర్లను వెలుగులోకి తీసుకొస్తాం’ అని అన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని శుక్రవారం పోటీలను ప్రారంభిస్తారు.