Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా ఐదో విజయం నమోదు చేసుకుంది. ప్లేట్ గ్రూప్లో భాగంగా మిజోరాంతో జరిగిన పోరులో హైదరాబాద్ ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. మిజోరాం తొలి ఇన్నింగ్స్లో 199 పరుగులు చేయగా.. హైదరాబాద్ 465/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మిజోరాం 193 పరుగులకు ఆలౌటైంది. మన బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. బంతితో 6 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్తో 60 పరుగులు చేసిన ఆల్రౌండర్ రోహిత్ రాయుడుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీంతో గ్రూప్ దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గిన హైదరాబాద్ 35 పాయింట్లతో పట్టిక టాప్లో నిలిచింది. ఈ ఐదు మ్యాచ్ల్లోనూ మనవాళ్లు ఇన్నింగ్స్ తేడాతో విజయాలు సాధించడం విశేషం.