గతేడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించిన తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ భారత-‘ఎ’ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్లో పాల్గొంటున్న తిలక్ వర్మ, ఈ నెల 22 నుంచి జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో బరిలోకి దిగనున్నాడు. దులీప్ ట్రోఫీలో అదరగొట్టిన యువ ఓపెనర్ పృథ్వీ షా తిరిగి జట్టులో చోటు దక్కించుకోగా, ఈ టీమ్కు సంజూ శాంసన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
న్యూఢిల్లీ: తెలంగాణ యువ ఆటగాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ భారత-‘ఎ’ వన్డే టీమ్లో చోటు దక్కించుకున్నాడు. గత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగి యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్శించిన తిలక్.. న్యూజిలాండ్-‘ఎ’తో జరుగనున్న వన్డే సిరీస్లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య అనధికారిక మూడో టెస్టు జరుగుతుండగా.. ఈ నెల 22 నుంచి చెన్నై వేదికగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దీని కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శుక్రవారం జట్టును ప్రకటించింది. యువ ఆల్రౌండర్ రాజ్ అంగద్ బవా… ఈ టీమ్లో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.
అండర్-19 ప్రపంచకప్లో ఆల్రౌండ్ మెరుపులతో వెలుగులోకి వచ్చిన రాజ్ బవా ఉపయుక్తకరమైన మీడియం పేస్తో పాటు మిడిలార్డర్లో భారీ షాట్లు కొట్టి ఆకట్టుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా వంటి పేస్ ఆల్రౌండర్ కోసం అన్వేషిస్తున్న టీమ్ మేనేజ్మెంట్ న్యూజిలాండ్-‘ఎ’తో వన్డే సిరీస్కు అంగద్ను ఎంపిక చేసింది. గతంలో శివం దూబే, విజయ్ శంకర్కు ఈ అవకాశం దక్కినా.. వాళ్లిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగించడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ జట్టుకు సంజూ శాంసన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ చోటు దక్కించుకున్నాడు. దులీప్ ట్రోఫీలో సత్తాచాటిన ఓపెనర్ పృథ్వీ షా తిరిగి జట్టులోకి రాగా.. ఇటీవల జింబాబ్వేతో సిరీస్లో ఆడిన ఆటగాళ్లకు చాన్స్ దక్కింది.