స్పెయిన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, సిక్కిరెడ్డి-అశ్విని ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ 21-7, 21-17తో డారెన్ లై (మలేషియా)పై సునాయాస విజయం పొందాడు. మహిళల డబుల్స్లో ‘బై’తో రెండో రౌండ్లోకి ప్రవేశించిన తెలంగాణ యువ షట్లర్ ఎన్.సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప ద్వయం 21-11, 9-21, 21-13తో లీ క్సుయాన్- క్సియా యు తింగ్ (చైనా) జోడీపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్లో ధ్రువ్ కపిల-అర్జున్ ద్వయం 11-21, 16-21తో రష్యా జోడీ వ్లాదిమిర్ ఇవానోవ్-ఇవాన్ సొజొనోవ్ చేతిలో ఓడిపోయింది. మొదటి గేమ్ ఆరంభంలో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ప్రణయ్ అనంతరం పుంజుకుని ప్రత్యర్థిని 7 పాయింట్లకు పరిమితం చేశాడు. హోరాహోరీగా మొదలైన రెండో గేమ్లో ఒకానొక దశలో సమం (6-6) కాగా ప్రణయ్ పుంజుకుని ప్రత్యర్థిపై విజృంభించాడు. మరోవైపు సిక్కిరెడ్డి-అశ్విని జోడీ తొలి గేమ్ను అలవోకగా విజయం సాధించగా.. రెండో గేమ్లో మాత్రం వెనుకంజ వేసింది. కీలకమైన ఆఖరి గేమ్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంతో గెలిచి ముందంజ వేసింది. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో భారత స్టార్లు సింధు, శ్రీకాంత్, యువ షట్లర్ లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్ చేరిన సంగతి తెలిసిందే.