కౌలాలంపూర్: నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న భారత అగ్రశ్రేణి షట్లర్ సాయిప్రణీత్.. మలేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. టోక్యో ఒలింపిక్స్ లీగ్ దశలోనే వెనుదిరిగిన సాయిప్రణీత్.. ఈ ఏడాది బరిలోకి దిగిన ఏడు టోర్నీల్లో ఆరింట తొలి రౌండ్లోనే వెనుదిరగడం గమనార్హం. మంగళవారం జరిగిన మలేషియా ఓపెన్ సూపర్-750 టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయి ప్రణీత్ 15-21, 21-19, 9-21తో ఆంటోనీ సినిసుక జిన్టింగ్ (ఇండోనేషియా) చేతిలో ఓడాడు. స్టార్ షట్లర్ ప్రణయ్ 21-14, 17-21, 21-18తో డారెన్ లీపై విజయం సాధించగా.. సమీర్వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 21-18, 21-11తో మలేషియా జోడీపై గెలిచింది.