Indonesian Open : ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000లో భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్(HS Pranay) పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో విక్టర్ అక్సెల్సెన్(Viktor Axelsen) చేతిలో పోరాడి ఓడిపోయాడు. దాంతో, వరుసగా పదోసారి సూపర్ 1000 ఫైనల్కు చేరాలనుకున్న అతడికి నిరాశే మిగిలింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ప్రణయ్ 21-15, 21-15తో అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. లీ షీఫెంగ్(Li Shifeng) లేదా అంథోని సినిసికుల గింటింగ్(Anthony Sinisuka Ginting) మ్యాచ్ విజేతతో విక్టర్ టైటిల్ పోరులో తలపడనున్నాడు.
ఏడో సీడ్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ కొడాయ్ నరోకాకు షాకిచ్చాడు. 55 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. 21-18, 21-16తో చిత్తు చేశాడు. సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లో కొడాయి చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
సాత్విక్ – చిరాగ్ జోడీ
మరోవైపు డబుల్స్లో సాత్విక్రాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జోడీ అదరగొట్టింది. సంచలన ఆటతో ఫైనల్లో అడుగుపెట్టి పతకం ఖాయం చేసింది. సెమీ ఫైనల్లో కాంగ్ మిన్ హయుక్ – సియో సియెంగ్ జే జోడీపై సాత్విక్ – చిరాగ్ అద్భుత విజయం సాధించారు. హోరాహోరీ పోరులో17-21, 21-19, 21-18తో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించారు. దాంతో, సూపర్ 1000 టోర్నమెంట్ ఫైనల్కు చేరిన మొదటి భారత జోడీగా రికార్డు సృష్టించారు. మరో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) క్వార్టర్స్లోనే ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. మహిళల సింగిల్స్లో పతకం తెస్తుందనుకున్న పీవీ సింధు(PV Sindhu) రెండో రౌండ్ దాటలేకపోయింది.