Hrishikesh Kanitkar | భారత మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్గా మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిత్కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న రమేశ్ పవార్ను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కి పంపారు. పవార్ ఎన్సీఏలో వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి పనిచేయనున్నారు. ఈ నెల 9 నుంచి ముంబైలో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే 5 మ్యాచుల టీ20 సిరీస్కు ముందు హృషికేశ్ జట్టులో చేరతాడని బీసీసీఐ మంగళవారం తెలిపింది. 2011 లో కొచ్చి టస్కర్స్ సహాయ కోచ్గా నియమితులైన కనిత్కర్.. ఓ వివాదం కారణంగా తొలగింపునకు గురయ్యాడు. 2015-16 లో గోవా రంజీ జట్టు ప్రధాన కోచ్గా, 2016-19 మధ్య తమిళనాడు రంజీ ప్రధాన కోచ్గా పనిచేశారు.
భారత మహిళల జట్టు కోచ్గా నియమితులైన 48 ఏండ్ల మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిత్కర్ మాట్లాడుతూ.. ‘జాతీయ మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్గా నియమించడం గర్వకారణంగా ఉననది. జట్టులో మంచి యువత, అనుభవం ఉన్నవారు కలగలిసి ఉన్నారు. ఈ జట్టు తమ ముందున్న సవాల్కు సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నాను. బ్యాటింగ్ కోచ్గా నాకు ఇది ఉత్తేజకరమైనది’ అని చెప్పారు.
ఎన్సీఏకు బదిలీ అయిన రమేష్ పవార్ మాట్లాడుతూ.. ‘సీనియర్ మహిళల జట్టు ప్రధాన కోచ్గా అనుభవం ఎంతో బాగుంది. ఏండ్లుగా నేను దేశంలోని కొందరు అనుభవజ్ఞులు, వర్ధమాన ప్రతిభావంతులతో కలిసి పనిచేశాను. ఎన్సీఏలో నా కొత్త పాత్రలో నా ఈ అనుభవాన్ని పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాను. బెంచ్ స్ట్రెంగ్త్ను పెంపొందించుకోవడానికి వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి పని చేయడానికి సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు.