జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీలో అంచనాల్లేకుండా బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన పైనల్లో హిమాచల్ ప్రదేశ్ వీజేడీ పద్ధతిలో 11 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ తమిళనాడుపై విజయం సాధించింది. దేశవాళీల్లో హిమాచల్కు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ (116; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) శతక్కొట్టగా.. బాబా అపరజిత్ (80), షారుక్ ఖాన్ (21 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. హిమాచల్ బౌలర్లలో పంకజ్ 4, రిషి ధవన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్ శుభమ్ అరోరా (136 నాటౌట్) అజేయ సెంచరీకి అమిత్ కుమార్ (74), కెప్టెన్ రిషి ధవన్ (23 బంతుల్లో 42 నాటౌట్) మెరుపులు తోడవడంతో హిమాచల్ 47.3 ఓవర్లలో 4 వికెట్లకు 299 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురు లేమి కారణంగా ఆటను నిలిపివేసిన అంపైర్లు వీజేడీ పద్ధతి ప్రకారం హిమాచల్ను విజేతగా ప్రకటించారు. శుభమ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
వారెవ్వా శుభమ్
ఐపీఎల్ మెగా వేలానికి ముందు యువ ఆటగాళ్లు సత్తాచాటేందుకు సరైన వేదికగా నిలిచిన ఈ టోర్నీలో హిమాచల్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. సెమీస్లో సర్విసెస్పై చక్కటి విజయంతో తుదిపోరుకు అర్హత సాధించిన హిమాచల్.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. టాస్ గెలిచిన హిమాచల్ కెప్టెన్ రిషి ధవన్ ఛేదనకు మొగ్గుచూపగా.. తొలుత బ్యాటింగ్కు దిగిన తమిళనాడు 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బాబా అపరజిత్ (2), జగదీశన్ (9), సాయి కిషోర్ (18), మురుగన్ అశ్విన్ (7) విఫలయ్యారు. ఈ దశలో దినేశ్ కార్తీక్, ఇంద్రజిత్ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ఈ ఇద్దరు ఐదో వికెట్కు 202 పరుగులు జోడించగా.. ఆఖర్లో షారుక్ ఖాన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఛేదనలో వికెట్ కీపర్ బ్యాటర్ శుభమ్ అరోరా ఆరంభం నుంచే ధాటిగా ఆడటంతో హిమాచల్ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. అతడికి అమిత్ కుమార్, రిషి ధవన్ చక్కటి సహకారం అందించడంతో హిమాచల్ ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగింది.
సంక్షిప్త స్కోర్లు
తమిళనాడు: 49.4 ఓవర్లలో 314 ఆలౌట్ (దినేశ్ కార్తీక్ 116, ఇంద్రజిత్ 80; పంకజ్ 4/59, రిషి 3/62), హిమాచల్ ప్రదేశ్: 47.3 ఓవర్లలో 299/4 (శుభమ్ అరోరా 136 నాటౌట్, అమిత్ 74; వాషింగ్టన్ సుందర్ 1/47)