ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ జాబితాలో మూడో స్థానానికి పడిపోయింది. అదే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరో రెండు శాతం పాయింట్లు కోల్పోవడంతో దాయాది పాకిస్తాన్ కన్నా తక్కువ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరింది.
సౌతాఫ్రికాలో చివరి రెండు టెస్టుల ఓటమి, ఇంగ్లండ్లో ఓటమితో భారత జట్టు ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో మరోసారి డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్) ఫైనల్ చేరడం భారత జట్టుకు కష్టంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో టీమిండియా ఇంకా ఆరు టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. వాటిలో నాలుగు మ్యాచులు ఆస్ట్రేలియాతో కాగా, రెండు మ్యాచులు బంగ్లాదేశ్తో జరుగుతాయి.
ఈ ఆరు మ్యాచుల్లోనూ భారత జట్టు గెలిచినా.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టమే. అదే సమయంలో భారత్ చేతిలో నాలుగు టెస్టులు ఓడిన ఆస్ట్రేలియా, ఇంకో ఆరు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. వాటిలో కనీసం రెండింటిని డ్రాగా ముగించుకుంటే ఆస్ట్రేలియా ఈ పోటీ నుంచి తప్పుకుంటుంది.
అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంతో భారత్కు మరో పెద్ద అడ్డంకిగా ఉన్న దేశం సౌతాఫ్రికా. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. మరో 8 మ్యాచులు ఆడాల్సి ఉంది. వాటిలో ఇంగ్లండ్తో మూడు, వెస్టిండీస్తో రెండు, ఆస్ట్రేలియాతో మూడు ఆడుతుంది. భారత జట్టు తను ఆడాల్సిన ఆరు మ్యాచుల్లో గెలిచి, సౌతాఫ్రికా కనీసం మూడు టెస్టుల్లో ఓడితే.. అప్పుడు సఫారీలను వెనక్కి నెట్టి భారత్ ముందంజ వేస్తుంది.
వీళ్లతోపాటు భారత్ కన్నా పాయింట్ల పట్టికలో ముందున్న జట్టు పాకిస్తాన్. ఈ దాయాది దేశం ఎలాగైనా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలని చూస్తోంది. అయితే ఈ జట్టు ఇంకా ఆడాల్సిన ఏడు టెస్టుల్లోనూ బలమైన ప్రత్యర్థులనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్తో మూడు, న్యూజిల్యాండ్తో రెండు, శ్రీలంకతో రెండు మ్యాచులు ఆడుతుంది.
వీటిలో కనీసం ఆరు మ్యాచుల్లో గెలిస్తే.. పాకిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో భారత్ను వెనక్కు నెట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. అదే కనుక భారత్ మిగిలిన ఆరు మ్యాచులు గెలిచి, పాకిస్తాన్ రెండు మ్యాచులు ఓడినా భారత్కు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.