న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్ ముప్పు పొంచి ఉందంటూ బీసీసీఐ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత సీజన్లో కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టీమ్ అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించినట్టు బోర్డు యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) గుర్తించింది. ఈ నేపథ్యంలో 10 ఫ్రాంచైజీల సీఈఓలకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కఠినమైన మార్గదర్శకాల (ఎస్ఓపీ)ను జారీ చేశారు. ‘చాలా సందర్భాల్లో ఆటగాళ్లు టీమ్ మేనేజర్లకు సమాచారం ఇవ్వకుండా అపరిచితులను తమ హోటల్ గదుల్లోకి అనుమతిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి పద్ధతులు ఆటగాళ్లను ఉచ్చులోకి (హనీ ట్రాప్) లాగేందుకు దారితీసే ప్రమాదం ఉంది. ప్లేయర్లను టార్గెట్ చేయడం ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన రహస్యాలను సేకరించే అవకాశం ఉంది’అని ఫ్రాంచైజీలకు రాసిన 7పేజీల లేఖలో సైకియా పేర్కొన్నారు.
ఇకపై గెస్టులు ఎవరైనా ఆటగాళ్ల గదికి వెళ్లాలంటే టీమ్ మేనేజర్ నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసిన బోర్డు అనధికారిక వ్యక్తులను గదుల్లోకి ఆహ్వానించడాన్ని తక్షణమే నిషేధిస్తున్నట్టు తెలిపింది.నిబంధనల అతిక్రమణ వల్ల కేవలం భద్రతా పరమైన సమస్యలే కాకుండా, లైంగిక వేధింపుల వంటి చట్టపరమైన ఆరోపణలు వచ్చే అవకాశం కూడా ఉందని బీసీసీఐ పేర్కొంది.
ఆటగాళు, సిబ్బంది నిర్ణీత సమయం దాటిన తర్వాత హోటల్ నుంచి బయటకు వెళ్లకూడదని, ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్కు సమాచారం ఇవ్వాలని సూచించింది. హనీ ట్రాప్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు బీసీసీఐ లేదా ఐపీఎల్ ఆపరేషన్స్ టీమ్ ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తుందని సైకియా పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే భారీ జరిమానాతోపాటు లీగ్ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు ఫ్రాంచైజీ యజమానులు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లను కలవడం, ఆలింగనం చేసుకోవడం వంటి చర్యలను బీసీసీఐ తప్పుపట్టింది. ‘ఇలాంటి ప్రవర్తన వల్ల మ్యాచ్ ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుంది’ అని పేర్కొంది. మ్యాచ్ సమయంలో ఓనర్లు క్రికెటర్లను కలవడాన్ని నిషేధించింది. అధికారిక మార్గాల ద్వారానే ఆటగాళ్లతో కమ్యూనికేట్ చేయాలని సూచించింది. ఇక, రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ కనిపించడం వివాదానికి దారితీసింది. దాంతో ఐపీఎల్ వేదికలు, హోటళ్లు, ప్రాక్టీస్ సెంటర్లలో ఈ-సిగరెట్ల వాడకంపై నిషేధం విధించిన బోర్డు వేపింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనుంది.