ఆమ్స్స్టెల్వీన్: పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత్కు మళ్లీ నిరాశే. మెగా టోర్నీలో ఐదు దశాబ్దాల తర్వాత చాంపియన్గా నిలవాలని ఆశించిన జట్టు పోరాటం సెమీఫైనల్ చేరకుండానే ముగిసింది. శనివారం కచ్చితంగా నెగ్గాల్సిన రెండో రౌండ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని టీమిండియా 1-3తో ఒలింపిక్ చాంప్ నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది. ఆఖరి 10 నిమిషాల్లో చేసిన పొరపాట్లు మన జట్టును దెబ్బతీశాయి. తొలి రెండు క్వార్టర్స్లో డిఫెండర్లు డచ్ దాడిని సమర్థవంతంగా అడ్డుకోవడంతో ఫస్టాఫ్ 0-0తో ముగించింది. కానీ, ద్వితీయార్థంలో డచ్ టీమ్ వరుస ఫీల్డ్ గోల్స్తో విరుచుకుపడింది.
41వ నిమిషంలో టెల్గెన్క్యాంప్, 51వ నిమిషంలో హుడెమేకర్స్ చెరో గోల్ కొట్టగా.. తర్వాతి నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్ను కెప్టెన్ హర్మన్ప్రీత్ డ్రాగ్ ఫ్లిక్తో గోల్ చేసి భారత శిబిరంలో ఆశలు రేపాడు. కానీ, 55వ నిమిషంలో థిజ్స్ వాన్ డామ్ సునాయాస గోల్ కొట్టి నెదర్లాండ్స్ విజయాన్ని ఖాయం చేశాడు. దాంతో, హాకీ ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఒక్కసారి కూడా ఓడని రికార్డును డచ్ టీమ్ కొనసాగించింది. కాగా, మహిళల టోర్నీలో ఆదివారం జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ పోటీ పడనుంది. ఇందులో గెలిస్తే సెమీస్ చేరుతుంది.