లండన్: వచ్చే నెలలో ప్రారంభం కానున్న హాకీ జూనియర్ ప్రపంచ కప్ నుంచి ఇంగ్లండ్ జట్టు తప్పుకుంది. భారత్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ నుంచి కరోనా సంబంధిత కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు ఇంగ్లండ్ సోమవారం ప్రకటించింది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు భువనేశ్వర్ వేదికగా ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచకప్ జరుగాల్సి ఉండగా.. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందే అని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ‘కొవిడ్-19 సంబంధిత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంగ్లండ్ నుంచి వచ్చే వాళ్లకు భారత్లో 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కావడంతో పాటు, జట్టు సహాయ సిబ్బంది దీనికి సంబంధించిన పలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే టోర్నీకి దూరమవుతున్నాం’ అని ఇంగ్లండ్ హాకీ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.