ODI World Cup | అక్టోబర్-23కు పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో అవినాభావ సంబంధం ఉన్నట్లు కనిపిస్తున్నది. నిరుడు ఇదే రోజున టీ20 ప్రపంచకప్లో భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్థాన్.. ఈసారి అఫ్గాన్ చేతిలో పరాజయం పాలైంది. 2022 అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ పోరులో పాకిస్థాన్పై టీమ్ఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన ప్లేయర్లు విఫలమైన చోట కింగ్ కోహ్లీ హీరోచిత ఇన్నింగ్స్తో జట్టును ఒంటిచేత్తో గెలిపించగా.. ఈసారి అఫ్గాన్ చేతిలో పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడింది.
2023 అక్టోబర్ 23న చెన్నై వేదికగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరగ్గా.. పాక్ జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం పాలై.. వన్డే ప్రపంచకప్ సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మెగాటోర్నీలో ఆడిన తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన పాకిస్థాన్.. ఆ తర్వాత వరుసగా భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ చేతిలో ఓడింది. వరల్డ్కప్లో ఇప్పటికే ఐదు మ్యాచ్లు ఆడిన పాకిస్థాన్ కేవలం రెండు విజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్నది.
బ్యాటింగ్, బౌలింగ్లోనే కాకుండా.. ఫీల్డింగ్లోనూ చెత్త ప్రదర్శన చేసిన పాకిస్థాన్కు వరుసగా మూడో పరాజయం తప్పలేదు. స్పిన్కు సహకరిస్తున్న పిచ్పై నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన అఫ్గాన్.. పాకిస్థాన్కు మరచిపోలేని ఓటమిని మిగిల్చింది. వన్డే క్రికెట్ చరిత్రలో పాక్పై అఫ్గాన్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. పాకిస్థాన్ తొలుత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. ఆ తర్వాత అఫ్గాన్ ఆడుతూ పాడుతూ 49 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పరాజయంతో పాక్ సారథి బాబర్ ఆజమ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 92 బంతుల్లో 74 పరుగులు చేసిన బాబరే జట్టు పరాజయానికి కారణమని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.