హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన తెలంగాణ హెప్టాథ్లెట్ నందిని అగసారాపై ఆమె టీమ్ మేట్, పశ్చిమబెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్ప బర్మన్ సంచలన కామెంట్స్ చేసింది. నందిని ట్రాన్స్జండర్ అని, ఆమె తనకు రావాల్సిన పతకాన్ని ఎగరేసుకుపోయిందని ఆరోపించింది.
ఆ మేరకు స్వప్న బర్మన్ ట్విటర్ (X)లో ఓ పోస్టు పెట్టింది. ‘చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నేను నాకు రావాల్సిన కాంస్య పతకాన్ని ఓ ట్రాన్స్జెండర్కు వదులుకోవాల్సి వచ్చింది. అథ్లెటిక్స్ రూల్స్కు విరుద్ధమైనా నేను నా మెడల్ను వెనక్కి ఇచ్చేయాలని కోరుతున్నా. దయచేసి నాకు సహాయం చేయండి, మద్దతు తెలియజేయండి’ అని స్వప్న ట్వీట్ చేశారు.
నందిని అగసారా పేరును ప్రస్తావించకుండానే ఆమెను ఉద్దేశించి ట్వీట్ చేసిన స్వప్న బర్మన్.. ఏమైందో ఏమోగానీ ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసింది. కాగా, మహిళల హెప్టాథ్లాన్ ఫైనల్స్లో నందిని అగసారా 5712 పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా, స్వప్న బర్మన్ 5708 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, స్వప్న బర్మన్ 2018 ఆసియా క్రీడల్లో ఇదే విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.