చెన్నై: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో పూర్తిగా విఫలమయ్యాడు. వరుసగా మూడు వన్డేల్లో యాదవ్ డకౌట్ అయ్యి పెవిలియన్కు చేరుకున్నాడు. దాంతో అతని ఆటతీరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం తన స్థాయికి తగినట్లు ఆడలేకపోతున్నాడని విమర్శలు మొదలయ్యాయి. 23 వన్డేలు ఆడిన సూర్య కేవలం 24.05 సగటుతో 433 పరుగులు మాత్రమే చేయడాన్ని విమర్శకులు ప్రస్తావిస్తున్నారు.
కానీ, టీమిండియా కెప్టెన్, స్కిప్పర్ రోహిత్ శర్మ మాత్రం సూర్యకుమార్ యాదవ్ను వెనకేసుకొచ్చాడు. మూడు వన్డేల సిరీస్లో సూర్యకుమార్ ఆడింది కేవలం మూడు బంతులేనని చెప్పాడు. అతని టైమ్ బ్యాడ్గా ఉంది కాబట్టే ప్రతి మ్యాచ్లో మంచి బంతినే తొలిబంతిగా ఎదుర్కోవాల్సి వచ్చిందన్నాడు. అతను 15 నుంచి 20 ఓవర్లు క్రీజులో నిలబడితే పరిస్థితి వేరుగా ఉంటుందని కితాబిచ్చాడు. గత రెండేళ్లుగా అతను స్పిన్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కోవడం చూశామని, ఈ ఒక్క సిరీస్లో విఫలమైనంత మాత్రాన సూర్య ఆటతీరును శంకించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. ఆ మూడు మ్యాచ్లలోనూ తొలి బంతికే డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ క్రమంలో అతని ఆటతీరుపై విమర్శలు వస్తుండగా.. రోహిత్ మాత్రం సూర్యకు అండగా నిలిచాడు. కాగా, భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా.. వరుసగా రెండు, మూడు వన్డేల్లో ఆస్ట్రేలియా గెలిచి ట్రోఫీని దక్కించుకుంది.