టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్పై పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. పంత్ చూడటానికి బాగున్నాడని.. కానీ కాస్త బరువు తగ్గితే భారత్లో అతడు భారీగా ఆర్జిస్తాడని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్తో మూడో వన్డేలో సెంచరీ చేసి భారత్ను గెలిపించిన పంత్ గురించి అక్తర్ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు.
అక్తర్ మాట్లాడుతూ.. ‘రిషభ్ పంత్ భయం లేని ఆటగాడు. అతడికి దూకుడెక్కువ. పంత్ కట్ షాట్, ఫుల్ షాట్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్, ప్యాడల్ స్వీప్ ఆడగలడు. ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ గెలిపించాడు. ఇప్పుడు ఇంగ్లండ్లో కూడా అదే ప్రదర్శనతో టీమిండియాకు ఒంటిచేత్తో సిరీస్ అందించాడు..
పంత్ చూడటానికి బాగున్నాడు. కానీ ఉండాల్సినదానికంటే కాస్త లావుగా ఉన్నాడు. అతడు తన ఫిట్నెస్పై దృష్టి సారించాలి. ఎందుకంటే ఇండియా మార్కెట్ చాలా పెద్దది. బరువు తగ్గితే అతడు మోడల్గా కూడా రాణించగలడు. ఇండియాలో ఎవరైనా సూపర్స్టార్గా అవతరిస్తే వాళ్లపై కోట్లు పెట్టుబడి పెట్టేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు..’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
ఇక ఇంగ్లండ్ పర్యటనలో పంత్ అద్భుతంగా రాణించాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో వీరోచిత సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ సాధించి భారత్ను ఆదుకున్నాడు. వన్డే సిరీస్లో వికెట్ల వెనుక కీలక క్యాచ్లు పట్టడంతో పాటు చివరి వన్డేలో హార్ధిక్ పాండ్యాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.