అత్యద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ కు టెస్టులలో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను అధిగమించే సత్తా ఉందంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్. రూట్ తన ఫామ్ ను ఇలాగే కొనసాగిస్తే అది అసాధ్యమేమీ కాదని అభిప్రాయపడ్డాడు. టెస్టులలో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరు మీదే ఉన్న విషయం తెలిసిందే.
ఇండియాతో ఇటీవలే ముగిసిన ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ లో రూట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సిరీస్ లో రూట్.. 737 పరుగులు సాధించాడు. మంగళవారం ముగిసిన ఎడ్జబాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన రూట్.. గడిచిన రెండున్నరేండ్లుగా కెరీర్ లో అత్యద్భుత ఫామ్ తో దూసుకుపోతున్నాడు. ఈ రెండేండ్లలో అతడు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లను అధిగమించాడు. ఇటీవలే ఇండియాతో మ్యాచ్ లో సెంచరీ (28) చేయడం ద్వారా అతడు టెస్టులలో కోహ్లి, స్మిత్ (27 సెంచరీలు) లను దాటేశాడు.
పరుగుల వరద పారిస్తున్న రూట్ గురించి జాఫర్ స్పందిస్తూ.. ‘రూట్ కు టెస్టులలో సచిన్ నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును అధిగమించే సత్తా ఉంది. అతడికిప్పుడు 31 ఏండ్లే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్ల కెరీర్ తక్కువే అయినా రూట్ మరో ఐదేండ్లు క్రికెట్ ఆడి ఇదే ఫామ్ కొనసాగిస్తే అతడు సచిన్ రికార్డులను బ్రేక్ చేసే అవకాశముంది..’ అని అభిప్రాయపడ్డాడు.
టెస్టులలో అత్యధిక పరుగుల రికార్డు విషయానికొస్తే.. సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో 200 టెస్టులలో 15,921 పరుగులు చేశాడు. జో రూట్.. ప్రస్తుతం 121 టెస్టులలో 10,458 పరుగులు సాధించాడు. సచిన్ రికార్డులను అధిగమించాలంటే రూట్.. మరో నాలుగేండ్లు ఇదే ఫామ్ ను కొనసాగించాలి. మరి ఈ ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ సారథి దానిని కొనసాగించగలడా..? అనేది కాలమే తేల్చనుంది.