న్యూఢిల్లీ: క్రీడాకారులు వ్యక్తిగత కోచ్లను పెట్టుకుంటే తప్పేంటనని భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనికా బాత్రా ప్రశ్నించింది. వ్యక్తిగత కోచ్లు ఉంటే ఇగో (అహం) కాదని, అది కనీస అవసరమని వ్యాఖ్యానించింది. గురువారం ఢిల్లీలో మనికా మాట్లాడుతూ.. ‘టీమ్ ఈవెంట్లు ఉన్నప్పుడు చీఫ్ కోచ్ ఉండటం సబబే. కానీ టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ లలో సింగిల్స్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు వ్యక్తిగత కోచ్ల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగత కోచ్ అయితే తాను శిక్షణనిచ్చే ప్లేయర్ ఆటతీరుతో పాటు అతడు/ఆమె గురించిన పూర్తి అవగాహన ఉంటుంది. కానీ చీఫ్ కోచ్ మొత్తం టీమ్ సభ్యుల పోటీల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కోచ్లను పెట్టుకోవడం ఇగో కాదు. అది కనీస అవసరం’ అని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్లో జరిగిన పలు మ్యాచ్లలో ఆమె టీటీ చీఫ్ కోచ్ సౌమ్యదీప్ రాయ్ను తిరస్కరించడంపై వివాదం నెలకొని షోకాజ్ నోటీసులను కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనికా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. షోకాజ్ నోటీసులకు మనికా స్పందిస్తూ.. రాయ్ మీద అభ్యంతరాలు లేవనెత్తింది. తనకు సరైన న్యాయం చేయాలని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ)కు లేఖ రాసింది.