మూడు ఫార్మాట్ల కెప్టెన్గా ఎంపికైన అనంతరం రోహిత్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. మరోవైపు పూర్తి స్థాయి సారథిగా బట్లర్కు కూడా ఇదే మొదటి మ్యాచ్.
సౌతాంప్టన్: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో ఆడిన విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోగా.. కరోనా పాజిటివ్ అని తేలడంతో సుదీర్ఘ ఫార్మాట్ చివరి మ్యాచ్కు దూరమైన రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 51; 6 ఫోర్లు, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (17 బంతులోల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ, జోర్డాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
కొవిడ్ నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు) మంచి టచ్లో కనిపించడంతో టీమ్ఇండియాకు మెరుగైన ఆరంభం లభించింది. టాప్లే వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన రోహిత్.. మోయిన్ అలీ ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టిన తర్వాత కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన దీపక్ హుడా క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అలీ వేసిన ఐదో ఓవర్లో వరుస బంతుల్లో రెండు భారీ సిక్సర్లు బాది ప్రత్యర్థికి హెచ్చరికలు పంపాడు. అయితే అదే ఓవర్లో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇషాన్ కిషన్ (8) క్యాచౌటయ్యాడు. ఓపెనర్లు వెనుదిరిగినా.. ఆరో ఓవర్లో హుడా హ్యాట్రిక్ ఫోర్లతో విజృంభించడంతో పవర్ప్లే ముగిసేసరికి భారత్ 66/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే మంచి జోరు మీదున్న హుడాను జోర్డాన్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్దిక పాండ్యా చక్కటి షాట్లతో అలరించాడు. పార్కిన్సన్ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన హార్దిక్.. మిల్స్కు ఫోర్తో స్వాగతం పలికాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. లెగ్సైడ్ చూడముచ్చటైన షాట్లతో ఆకట్టుకున్న సూర్యకుమార్ను జోర్డాన్ బుట్టలో వేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో దినేశ్ కార్తీక్ కంటే ముందొచ్చిన అక్షర్ పటేల్ (17) హార్దిక్కు చక్కటి సహకారమందించాడు. ఈ క్రమంలో పాండ్యా 30 బంతుల్లో తొలి అంతర్జాతీయ అర్ధశతకం తన పేరిట రాసుకున్నాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (11) ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు.
ఐపీఎల్లో అదరగొట్టి.. జాతీయ జట్టుకు ఎంపికైన యువ పేసర్ అర్శ్దీప్ సింగ్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. ఆట ఆరంభానికి ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్శ్దీప్కు క్యాప్ అందించాడు. ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్తో కలిసి అర్శ్దీప్ బరిలోకి దిగాడు.