టీమ్ఇండియా దెబ్బకు దెబ్బ కొట్టింది. పది నెలల క్రితం ఇదే మైదానంలో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి సరైన రీతిలో బదులు తీర్చుకుంది. పేసర్లకు సహకరించిన పిచ్పై మొదట భువనేశ్వర్ నేతృత్వంలోని భారత బౌలింగ్ దళం పాక్ను తక్కువ స్కోరుకే కట్టడి చేస్తే.. ఆనక బ్యాటింగ్లో కోహ్లీ, జడేజా, హార్దిక్ రాణించడంతో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. దాయాదుల మధ్య పోరులో సహజసిద్ధంగా ఉండే ఒత్తిడి అడుగడుగునా ప్రస్ఫుటించగా.. అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో రోహిత్ సేనసింహగర్జన చేసింది.
దుబాయ్: దాయాదుల సమరంలో మరోసారి భారత్దే పైచేయి అయింది. గతేడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇదే మైదానంలో పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాభవానికి టీమ్ఇండియా బదులు తీర్చుకుంది. ఆసియా కప్ గ్రూప్-‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాక్.. భువనేశ్వర్ కుమార్ (4/26), హార్దిక్ పాండ్యా (3/25) ధాటికి.. 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (43; 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో అర్శ్దీప్ రెండు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం సులభతరమైన లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (0) ఖాతా తెరువకుండానే వెనుదిరగగా.. చాన్నాళ్లుగా ఫామ్లేమితో సతమతమవుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ (12) ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా (29 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. విజయ సమీకరణం క్లిష్టంగా మారిన తరుణంలో హార్దిక్ పిడుగుల్లాంటి షాట్లతో జట్టును గెలిపించాడు. హరీస్ వేసిన 19వ ఓవర్లో మూడు ఫోర్లు అరుసుకున్న పాండ్యా.. చివరి ఓవర్ నాలుగో బంతికి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ తమ తదుపరి పోరులో బుధవారం హాంకాంగ్తో తలపడనుంది.
హార్దిక్ డబుల్ స్ట్రోక్
సీనియర్ పేసర్ బుమ్రా అందుబాటులో లేకపోయినా.. భారత బౌలింగ్ దళం పాకిస్థాన్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే వికెట్ల ముందు దొరికిపోయినట్లు కనిపించిన రిజ్వాన్ రివ్యూ కోరి బతికిపోగా.. మూడో ఓవర్లో ఓ బౌన్సర్తో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను భువీ బుట్టలో వేసుకున్నాడు. రెండు ఫోర్లతో దూకుడు కనబర్చిన ఫఖర్ జమాన్ (10)ను అవేశ్ ఖాన్ ఔట్ చేయగా.. 10 ఓవర్లు ముగిసేసరికి పాక్ 68/2తో నిలిచింది. ఈ దశలో రిజ్వాన్తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టిన ఇఫ్తిఖార్ (28; 2 ఫోర్లు, ఒక సిక్సర్)ను పాండ్యా పెవిలియన్ బాట పట్టించాడు. పాండ్యా తదుపరి ఓవర్లో రిజ్వాన్, ఖుష్దిల్ (2)ను ఔట్ చేసి పాక్ బ్యాటింగ్ వెన్ను విరువగా.. ఆ తర్వాత ఆసిఫ్ అలీ (9), మహమ్మద్ నవాజ్ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్లో షాదాబ్ (10), నసీమ్ షా (0) వరుస బంతుల్లో ఔట్ కాగా.. ఆఖర్లో షానవాజ్ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు) భారీ షాట్లతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.\
కొంతే కొండంతైతే..
లక్ష్యం పెద్దది కాకపోయినా తొలి ఓవర్లోనే టీమ్ఇండియాకు షాక్ తగిలింది. అంతర్జాతీయ స్థాయిలో తొలి మ్యాచ్ ఆడుతున్న నసీమ్ షా బౌలింగ్లో బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న రాహుల్ (0) గోల్డెన్ డక్గా వెనుదిరగగా.. ఆ తర్వాత రోహిత్, కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. షానవాజ్ బౌలింగ్లో మిడ్వికెట్ దిశగా చక్కటి బౌండ్రీ బాదిన కోహ్లీ.. హరీస్ ఓవర్లో భారీ సిక్సర్ అరుసుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా విరాట్ బౌండ్రీలు రాబడుతుండటంతో ఛేదన సునాయాసంగా కనిపించింది. రెండో వికెట్కు 49 పరుగులు జోడించాక రోహిత్ ఔట్ కాగా.. ఆ వెంటనే విరాట్ కూడా వెనుదిరిగాడు. దీంతో సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి భారత్ 62/3తో నిలిచింది. ఈ దశలో పాక్ బౌలర్లు ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించినా జడేజా, సూర్యకుమార్ (18) పోరాడారు. 35 బంతుల్లో 59 పరుగులు చేయాల్సిన దశలో సూర్యకుమార్ ఔట్ కాగా.. ఆతర్వాత జడ్డూతో కలిసి హార్దిక్ పాండ్యా జట్టును విజయతీరాలకు చేర్చాడు.
స్కోరు బోర్డు
పాకిస్థాన్: రిజ్వాన్ (సి) అవేశ్ (బి) పాండ్యా 43, బాబర్ (సి) అర్శ్దీప్ (బి) భువనేశ్వర్ 10, ఫఖర్ (సి) కార్తీక్ (బి) అవేశ్ 10, ఇఫ్తిఖార్ (సి) కార్తీక్ (బి) పాండ్యా 28, ఖుస్దిల్ (సి) జడేజా (బి) పాండ్యా 2, షాదాబ్ (ఎల్బీ) భువనేశ్వర్ 10, ఆసిఫ్ (సి) సూర్యకుమార్ (బి) భువనేశ్వర్ 9, నవాజ్ (సి) కార్తీక్ (బి) అర్శ్దీప్ 1, హరీస్ (నాటౌట్) 13, నసీమ్ (ఎల్బీ) భువనేశ్వర్ 0, షానవాజ్ (బి) అర్శ్దీప్ 16, ఎక్స్ట్రాలు: 5, మొత్తం: 19.5 ఓవర్లలో 147 ఆలౌట్. వికెట్ల పతనం: 1-15, 2-42, 3-87, 4-96, 5-97, 6-112, 7-114, 8-128, 9-128, 10-147, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-26-4, అర్శ్దీప్ 3.5-0-33-2, పాండ్యా 4-0-25-3, అవేశ్ 2-0-19-1, చాహల్ 4-0-32-0, జడేజా 2-0-11-0.
భారత్: రోహిత్ (సి) ఇఫ్తిఖార్ (బి) నవాజ్ 12, రాహుల్ (బి) నసీమ్ షా 0, కోహ్లీ (సి) ఇఫ్తిఖార్ (బి) నవాజ్ 35, జడేజా (బి) నవాజ్ 35, సూర్యకుమార్ (బి) నసీమ్ షా 18, పాండ్యా , కార్తీక్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 14, మొత్తం: 19.4 ఓవర్లలో 148/5. వికెట్ల పతనం: 1-1, 2-50, 3-53, 4-89, 5-141, బౌలింగ్: నసీమ్ షా 4-0-27-2, షానవాజ్ 4-0-29-0, హరీస్ 4-0-35-0, షాదాబ్ 4-0-19-0, నవాజ్ 3.4-0-33-3.