IPL 2024 | పాకిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడితే ఎలా ఉంటుంది..? ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) లో మాత్రమే పలువురు పాక్ ఆటగాళ్లు ఈ లీగ్లో భాగమయ్యారు. కానీ ఆ తర్వాత ఇరు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లను ఐపీఎల్లోకి అనుమతించడం లేదు. అయితే త్వరలోనే ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభమవనున్న నేపథ్యంలో కొంతమంది పాక్ ఫ్యాన్స్.. ఆ దేశపు క్రికెటర్లు బాబర్ ఆజమ్, షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్లు ఈ లీగ్లో ఆడుతున్నట్టు ఎడిటెడ్ పిక్స్తో పోస్టులు చేస్తున్నారు. దీనిపై తాజాగా భారత మాజీ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అలి రజా ఆలమ్ – క్రికెటర్ అని ప్రొఫైల్ ఉన్న ఓ ట్విటర్ (ఎక్స్) ఖాతాలో.. బాబర్ ఆజమ్ – విరాట్ కోహ్లీ (ఆర్సీబీ) , షహీన్ అఫ్రిది – జస్ప్రిత్ బుమ్రా (ముంబై), మహ్మద్ రిజ్వాన్ (సీఎస్కే) తరఫున ఆడినట్టు ఎడిట్ చేసిన పిక్స్ను షేర్ చేశారు. అందులో ‘చాలా మంది భారత్ – పాక్ క్రికెట్ అభిమానుల డ్రీమ్ ఇది’ అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ హర్భజన్ కంటపడింది. దానికి భజ్జీ ఏమాత్రం ఆలోచించకుండా.. ‘భారతీయులకైతే అలాంటి కలలు ఏమీలేవు. మీరు దయచేసిన పగటికలలు కనడం మానండి. ఇకనైనా మేల్కొండి..!’ అని కౌంటర్ ఇచ్చాడు. భజ్జీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
No indian hv such dreams .. you guys plz stop dreaming 😴😂😂 wake up now https://t.co/EmraFXiIah
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 15, 2024