ఈనెల 16 నుంచి ప్రారంభం కాబోతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) రెండవ సీజన్లో ఆడబోయే నాలుగు ఫ్రాంచైజీలకు సారథులు ఖరారయ్యారు. నాలుగు జట్లకు గత దశాబ్దిలో భారత్కు చిరస్మరణీయ విజయాలు అందించిన ఆటగాళ్లే కెప్టెన్లుగా ఎంపికయ్యారు. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్, అభిమానులంతా టర్బోనేటర్ అని పిలుచుకునే హర్భజన్ సింగ్ ‘మణిపాల్ టైగర్స్’కు కెప్టెన్గా ఎంపికవగా.. స్వింగ్ కింగ్ ఇర్ఫాన్ పఠాన్ ‘భిల్వారా కింగ్’ టీమ్కు సారథిగా వ్యవహరించనున్నాడు.
నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్న ఎల్ఎల్సీలో ఇప్పటికే ప్రకటించిన గుజరాత్ జెయింట్స్కు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ కాగా ఇండియా క్యాపిటల్స్కు గౌతం గంభీర్ నాయకుడిగా నియమితుడయ్యాడు. తాజాగా మణిపాల్, బిల్వారా ఫ్రాంచైజీలకు భజ్జీ, పఠాన్ సారథులుగా ఎంపికయ్యారు. ఈ నలుగురు గతంలో భారత జట్టుకు కలిసి ఆడినవారే కావడం గమనార్హం.
సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కాబోతున్న ఎల్ఎల్సీ రెండో సీజన్లో తొలి మ్యాచ్ను ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య నిర్వహిస్తున్నారు. భారత్కు స్వతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బీసీసీఐ ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నది. ఇండియా మహారాజాస్కు సౌరవ్ గంగూలీ, వరల్డ్ జెయింట్స్కు ఇయాన్ మెర్గాన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఈ టోర్నీ లక్నో, న్యూఢిల్లీ, జోధ్పూర్, కటక్, కోల్కతాలలో జరుగనుంది. మొత్తం 22 మ్యాచ్లుండే ఈ టోర్నీ ఈనెల 16 నుంచి అక్టోబర్ 8వరకు ఈ టోర్నీ సాగుతుంది.