వాండరర్స్లో అనూహ్య పరాజయం తర్వాత సఫారీలతో మూడో టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. అయితే రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో ఫామ్లో లేని పుజారా, రహానే అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో వీరికి మరో అవకాశం ఇవ్వాలని కొందరు మాజీలు అంటున్నారు.
అయితే కోహ్లీ గైర్హాజరీలో జట్టులో చేరిన హనుమ విహారి కూడా 40 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. కానీ, మూడో టెస్టులో కోహ్లీ వస్తే విహారిని తొలగించేస్తారని వార్తలు వస్తున్నాయి. వీటిపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.
విహారి చేసిన 40 పరుగులు ఏ అర్ధశతకానికి తక్కువేమీ కాదని ఈ మాజీ ఓపెనర్ స్పష్టం చేశాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ చక్కని ప్రదర్శన చేసిన విహారికి మూడో టెస్టులో అవకాశం దక్కకపోతే చాలా దురదృష్టమని అభిప్రాయపడ్డాడు.
‘‘రహానే హాఫ్ సెంచరీ చేశాడనే కారణంతో విహారిని ఆడించకపోవడం సమంజసం కాదు. రహానే ఆడిన స్థానంలో విహారి అడితే అతను కూడా హాఫ్ సెంచరీ చేసేవాడేమో?’’ అని గంభీర్ అన్నాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ చాలా నియంత్రణతో విహారి ఆడాడని, అలాంటి ఆటగాడికి అవకాశాలు ఇవ్వాలని చెప్పాడు. ఇప్పుడొక మ్యాచ్ అవకాశం ఇచ్చి మళ్లీ ఆర్నెల్లకో, ఏడాదికో మరో అవకాశం ఇవ్వడం సరికాదన్నాడు.
కొంత కాలంగా రహానే ఇస్తున్న ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలని, కోహ్లీ గనుక మూడో టెస్టు ఆడితే రహానేను తొలగించి ఐదో స్థానంలో విహారిని ఆడించాలని సూచించాడు. రహానేకు జట్టు యాజమాన్యం ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు, విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించాడు.