బెంగళూరు: భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని.. టీమ్ఇండియా ప్లేయర్ హనుమ విహారి అన్నాడు. క్రికెట్లో రాజకీయ నేతల జోక్యంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విహారి సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ చేతిలో ఆంధ్ర పరాజయం పాలైన అనంతరం విహారి తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘ఆటలో రాజకీయాలు తగవు. ఓ నేత కుమారుడి కోసం నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. రంజీ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడిపై నేను కోప్పడ్డాను. అతడు తన తండ్రి రాజకీయ అండతో నాపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏసీఏపై ఒత్తిడి చేశాడు. దీంతో సారథ్య బాధ్యతల నుంచి నన్ను తప్పించారు’ అంటూ విహారి సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. మరోవైపు విహారీ ప్రవర్తనపై జట్టు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.