బీజింగ్: ప్రతిష్ఠాత్మక ఆసియా పారా గేమ్స్ వాయిదా పడ్డాయి. చైనాలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9 నుంచి 15 వరకు హంగ్జు వేదికగా పారాగేమ్స్ జరుగాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే హంగ్జుతో పాటు పలు నగరాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా ఇప్పటికే ఆసియా గేమ్స్ వాయిదా పడగా, తాజాగా పారాగేమ్స్ ఈ జాబితాలో చేరాయి.
హంగ్జు ఆసియా పారా గేమ్ కమిటీ, ఆసియా పారాలింపిక్ కమిటీ(ఏపీసీ) మంగళవారం సమావేశమై క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో తిరిగి గేమ్స్ను నిర్వహించాలనేది మరి కొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశముంది.